నాగ్‌ నిర్ణయం పై ప్రశంసలు..!

నాగార్జున చాలా విషయాలలో చాలా డిసిప్లెయిన్‌గా ఉంటారు. ఇంత అనుభవం ఉన్నా కూడా స్క్రిప్ట్‌ను లాక్‌ చేసిన తర్వాత ఆయన ఇక దర్శకులకు పూర్తి స్వేఛ్చనిస్తారు. ఆయన తన అనుభవంలో సినిమాల షూటింగ్‌ సమయంలోనే ఆ దర్శకుడు చెప్పినట్లు తీస్తున్నాడా? సినిమా ఆడుతుందా? లేదా? వంటి విషయాలపై కూడా ఓ అవగాహనకు రాగల సమర్దుడు. కాగా ఆయన చిన్న కుమారుడు అక్కినేని అఖిల్‌ బలవంతం మీద అతని మొదటి చిత్రం 'అఖిల్‌' విషయంలో నాగ్‌ పెద్దగా జోక్యం చేసుకోలేదు. ఆ చిత్రం పరాజయం పాలైన తర్వాత కూడా తన కొడుకు... ప్రపంచాన్ని కాపాడే భారీ బాధ్యత ఇంకా తీసుకొనే వయసులేదని చెప్పి తన హుందాతనాన్ని చాటుకున్నాడు. కాగా ప్రస్తుతం ఆయన అఖిల్‌ రెండో చిత్రం విషయంలో తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. 'మనం' వంటి క్లాసిక్‌నిచ్చిన విక్రమ్‌ కె.కుమార్‌ మొదట చెప్పిన కథ బాగా నచ్చినప్పటికీ ఈ కథ సెకండాఫ్‌ వింటుంటే తనకే పలు సందేహాలు వచ్చాయని, మరి రేపు ప్రేక్షకులకు మరెన్ని సందేహాలు వచ్చే అవకాశం ఉందని భావించి, మొదటి కథను పక్కనపెట్టించి మరో కథపై కూర్చొనేలా విక్రమ్‌ని ప్రోత్సహించాడు. ఈ కథ బాగా రావడంతో స్క్రిప్ట్‌ను లాక్‌ చేయించి త్వరలో సినిమా ప్రారంభించడానికి ముహూర్తం చూసుకుంటున్నాడు. కాగా ఈ చిత్రం విషయంలో ఆయన దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌పై ఎంతగానో నమ్మకం ఉంచి, ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో కేవలం దర్శకుడు చెప్పినట్లు వినాలని, మిగిలిన విషయాలను తాను, విక్రమ్‌ జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి అఖిల్‌ను ఈ చిత్రం విషయంలో వేలు పెట్టవద్దని ఆదేశించాడట. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చి, సినిమాలో ఏదీ ఓవర్‌గా చేయకుండా, దర్శకుని వ్యూలోనే ఆలోచించమని అఖిల్‌కు సూచించాడని సమాచారం. ఈ విషయంలో నాగ్‌ నిర్ణయాన్ని సినీ విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు. 

nagarjuna
akhil and vikram k kumar movie
nagarjuna decision