Advertisement

నాగబాబు అంటే బన్నీకి ఇంత అభిమానమా..!

Thu 24th Nov 2016 11:58 PM
mega brother nagababu,vakkantham vamsi,allu arjun,nagababu anjana productions,bunny affection on nagababu  నాగబాబు అంటే బన్నీకి ఇంత అభిమానమా..!
నాగబాబు అంటే బన్నీకి ఇంత అభిమానమా..!
Advertisement

మెగాబ్రదర్‌గా నాగబాబు అందరికీ సుపరిచితుడే. నటునిగా, నిర్మాతగా, బుల్లితెర సీరియళ్లలో కూడా నటించి, ప్రస్తుతం ఓ ఫేమస్‌ షోకి జడ్జిగా ఉన్నాడు. ఆయన కొడుకు వరుణ్‌తేజ్‌తో సహా ఆయన కుమార్తె, మెగాడాటర్‌ నిహారికను కూడా హీరోయిన్‌ని చేశాడు. తన అన్నయ్య చిరంజీవి, తన తమ్ముడు పవన్‌కళ్యాణ్‌, అబ్బాయ్‌ రామ్‌చరణ్‌తో పాటు ఇతర హీరోలతో కూడా ఒకటి రెండు చిత్రాలను నిర్మించాడు. తన తల్లి పేరుతో స్దాపించిన అంజనా ప్రొడక్షన్స్‌ బేనర్‌లో ఈ చిత్రాలన్నింటిని నిర్మించాడు. అభిరుచి ఉన్న నిర్మాతగా, 'రుద్రవీణ' వంటి సందేశాత్మకమైన, ప్రయోగాత్మక చిత్రంతో అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. కానీ ఆయన తీసిన చిత్రాలలో చాలా చిత్రాలు ఆయనకు తీవ్ర ఆర్దిక నష్టాలను మిగిల్చాయి. ముఖ్యంగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఆయన నిర్మించిన 'ఆరెంజ్‌' చిత్రం ఆయనకు భారీ నష్టాలనే మిగిల్చింది. దాంతో ఆయన ప్రస్తుత దర్శకుల తీరు నచ్చక ఇకపై నిర్మాతగా కొనసాగనని, తాను తీవ్ర ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నానని, తన అన్నయ్య చిరంజీవి, తన తమ్ముడు పవన్‌కళ్యాణ్‌లు తనను ఆర్దికంగా ఆదుకున్నప్పటికీ ఇకపై నిర్మాతగా కొనసాగే ఆలోచన లేదన్నాడు. అంతేకాదు.. 'ఆరెంజ్‌' చిత్రం స్టోరీ నచ్చే తాను చిత్రం నిర్మించానని, జయాపజయాలు సహజమే అన్నాడు. అందువల్ల తాను 'ఆరెంజ్‌' చిత్రం ఫ్లాప్‌కు బాధ్యత వహిస్తున్నానని, ఈ విషయంలో తాను దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ను తప్పుపట్టనని, కానీ ఈ చిత్రాన్ని అనుకున్న సమయంలో, ముందుగా అనుకున్న బడ్జెట్‌లో తీయకుండా, ప్రతి విషయానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టించి తాను అనుకున్న బడ్జెట్‌లో, అనుకున్న సమయంలో చిత్రం తీయకుండా చేసిన బొమ్మరిల్లు భాస్కర్‌ను మాత్రం ఈ విషయంలో తాను తప్పుపడుతున్నానని మీడియా ఎదుట, అందరి సమక్షంలో ముక్కుసూటిగా తన వాదనను వినిపించాడు. 

కాగా ప్రస్తుతం మెగాకాంపౌండ్‌కు చెందిన అల్లుఅర్జున్‌ మరలా ఆయనను నిర్మాణరంగంలోకి దించేలా ప్రయత్నాలు చేస్తున్నాడని, అందుకు తాను కూడా సహాయం చేస్తానని నాగబాబును ఒప్పించాడని సమాచారం. ప్రస్తుతం దిల్‌రాజు బేనర్‌లో బన్నీ 'డిజె' చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత ఆయన లింగుస్వామి దర్శకత్వంలో ద్విభాషా చిత్రం చేయడానికి అంగీకరించాడు. ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన తనకు 'రేసుగుర్రం' వంటి హిట్‌ స్టోరీని అందించిన స్టార్‌రైటర్‌ వక్కంతం వంశీకి దర్శకునిగా అవకాశం ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని ఆయన లగడపాటి శ్రీధర్‌తో కలిసి నాగబాబు భాగస్వామిగా చేయనున్నాడని విశ్వసనీయ సమాచారం. దీనికి నాగబాబు ఒప్పుకోలేదని, కానీ బన్నీ మాత్రం మీ వెనుక నేనున్నాను... డబ్బుల సంగతి నాకు వదిలేయండి. మీకున్న అనుభవంతో ఈ చిత్రాన్ని నా తరపున పర్యవేక్షించమని ఒప్పించాడంటున్నారు. ఇలా తమ హీరో నాగబాబుకు ఎవ్వరూ చేయని సాయం చేస్తున్నాడని, అలాగే ఎంతో కాలంగా ఎన్టీఆర్‌ను నమ్మి దర్శకునిగా తనకొచ్చిన అవకాశాలు వదిలేసుకుంటూ వచ్చిన వక్కంతం వంశీని ఎన్టీఆర్‌ మోసం చేసినా, తమ హీరో ఆయనకు అవకాశం ఇస్తుండటంతో బన్నీ గ్రేట్‌ అని ఆయన అభిమానులు అంటున్నారు. మరి వక్కంతం సంగతి పక్కన పెడితే నాగబాబుకు నిర్మాతగా ఉన్న అనుభవాన్ని బన్నీ వాడుకొంటున్నాడా? లేక నిజాయితీగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఈ అవకాశం ఇస్తున్నాడా? అనే పాయింట్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement