ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయలో రెండున్నరేళ్ళుగా ఊరించి ఊరించి ప్రజలను నిరుత్సాహ పరిచింది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక హోదా అన్న పదాన్ని కూడా వాడటానికి జైట్లీ మనస్సు అంగీకరించలేదు. ముఖ్యంగా బుధవారం చాలా ప్రాధాన్యం సంతరించుకున్న రోజుగా భావించిన ఏపీ ప్రజలు ఉదయం నుంచి కేంద్రం ప్రకటన కోసం టీవీల ముందు కూర్చొని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. అలా చూసిన వారికి నిరుత్సాహపరిచే సమాచారాన్ని అందించింది కేంద్ర ప్రభుత్వం. ఒకరకంగా కేంద్రం కొత్తగా చెప్పిందంటూ ఏం లేదు. పాడిందే పాడరా పాచిపళ్ళ దాచరా అన్నట్లు చెప్పిన విషయాన్నే చెప్పింది. అందులో ఏం కొత్తదనం, చిక్కదనం లేదు. రంగు రుచి అస్సలే లేదు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ విషయంపై కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు బుధవారం రాత్రి చాలా కీలక ప్రకటన అని ప్రజలు భావించే విధంగా మీడియా ముందు వ్యవహరించారు. వాళ్ళు ప్రకటించాక తెలిసింది అందులో కొత్తగా ఏం చెప్పారు అన్న విషయం. ముందుగా జైట్లీ మాట్లాడుతూ... 'విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ఆదాయం విపరీతంగా తగ్గిపోయింది. కాబట్టి ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోరడంలో తప్పులేదు’ అన్నాడు. ఇంకా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చుతుంది. ఆ క్రమంలోనే హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఏపీ హోదాపై మాజీ ప్రధాని మన్మోహన్ ప్రకటన, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు తదితర నాలుగు అంశాల ఆధారంగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని ప్రకటించాడు జైట్లీ. ప్యాకేజీలో భాగంగా ఏమేం ఇస్తాం అన్నది వివరాలు త్వరలో వెల్లడిస్తాం అన్నట్లు జైట్లీ వెల్లడించాడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని 100 శాతం కేంద్రమే భరిస్తుందన్నాడు.
కాగా రెవెన్యూ లోటుకు సంబంధించి14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా ఏపీకి సాయమందిస్తామని వివరిచాడు. ఇంకా రైల్వే జోన్ కేటాయింపు ఎక్కడనే విషయం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానికి వదిలేశానన్నాడు. ఇక ఫైనల్ గా ఏం చెప్పాడంటే హోదా కాదు ప్యాకేజీ వస్తుందన్న విషయాన్ని తేటెతెల్లపరిచాడు కేంద్రం రాయభారి జైట్లీ. అస్సలు ఇప్పుడు కేంద్రం చేసిన ప్రకటనలో కొత్తగా ఏముంది. అంటే విభజించే ముందే ఏమైతే ముసాయిదాలో రాశారో వాటిపై కూడా స్పష్టంగా వివరణ లేదు. చూడబోతే ముందు ముందు విభజన చట్టంలో పొందుపరిచినవి ఏపీలో అమలు చేసేందుకోసం, వాటిని పూర్తి చేయించుకోవడం కోసం ఏపీ ప్రజలు కేంద్రంతో ఫైట్ చేసే పరిస్థితి వచ్చేట్టుగా ఉంది. ఆంధ్రప్రజలపై కేంద్ర తీరు ఎలా ఉందంటే నొప్పించక, తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న చందంగా మారింది.