నిబంధనలను పదేపదే ఉల్లంఘించినందుకు.. డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. 1949 నాటి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లోని షరతులను పాటించడంలో విఫలమైనందున.. వెంటనే బ్యాంకింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. అయితే ఖాతాదారులు తమ సొమ్ము గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. డిపాజిటర్లందరికీ తిరిగి చెల్లించడానికి సరిపడా నగదు నిల్వలు బ్యాంక్ వద్ద ఉన్నాయని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. బ్యాంక్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసే ప్రక్రియ కోసం కేంద్ర బ్యాంక్ త్వరలో హైకోర్టును ఆశ్రయించనుంది.
మరోవైపు పేటీఎం యాప్ వినియోగదారులకు ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. బ్యాంక్ లైసెన్స్ రద్దయినా కానీ యాప్ ద్వారా అందించే యూపీఐ, మొబైల్ రీఛార్జ్లు, ఇతర బిల్లు చెల్లింపుల వంటి సేవలు యథావిధిగా కొనసాగుతాయి. పేటీఎం మాతృ సంస్థ `వన్97 కమ్యూనికేషన్స్` తాజా పరిణామంపై స్పందిస్తూ.. తమ క్యూఆర్ కోడ్స్, సౌండ్బాక్స్ , పేమెంట్ గేట్వే సేవలకు ఎలాంటి అంతరాయం కలగదని స్పష్టం చేసింది. అలాగే పేటీఎం గోల్డ్, పేటీఎం మనీ వంటి ఇతర ఇన్వెస్ట్మెంట్ సేవలు కూడా సురక్షితంగా పనిచేస్తాయని సంస్థ వెల్లడించింది. కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్తో అనుబంధం ఉన్న బ్యాంకింగ్ సేవలు మాత్రమే నిలిచిపోతాయి తప్ప సాధారణ డిజిటల్ చెల్లింపులపై దీని ప్రభావం ఉండదు.




అందుకే నయనతారను తప్పించారా 
Loading..