మంచు బ్రదర్స్ మంచు విష్ణు- మంచు మనోజ్ మధ్య గొడవలు రకరకాల మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా వారి మధ్య గొడవలు ఉన్నా కానీ, ఇద్దరూ తిరిగి కలుసుకోవాలన్న ఆకాంక్షను మీడియా ఎదుట వెలిబుచ్చారు. భైరవం ప్రచార ఇంటర్వ్యూల్లో మంచు మనోజ్, తమ్మారెడ్డి భరద్వాజతో యూట్యూబ్ చిట్ చాట్ లో మంచు విష్ణు తమ ఫ్యామిలీ అంతా తిరిగి కలిసేందుకు అవకాశం ఉందని అన్నారు. మంచు బ్రదర్స్ ని త్వరలోనే తాను మధ్యవర్తిత్వం వహించి కలిపేస్తానని మోహన్ బాబు సన్నిహితుడైన దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా అన్నారు.
అయితే తమ్మారెడ్డి భరద్వాజతో ఇంటర్వ్యూ అనంతరం, ఇంతలోనే ఇప్పుడు తన తమ్ముడు మనోజ్ పై మంచు విష్ణు ఆరోపణలు ఆశ్చర్యపరిచాయి. రిలీజ్ కి సిద్ధమైన తన చిత్రం కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగతనానికి గురైందని, ఈ దొంగతనం వెనుక తన సోదరుడు మనోజ్ ఉన్నారని విష్ణు ఆరోపించారు. శుక్రవారం చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో విష్ణు మాట్లాడుతూ.. హార్డ్ డిస్క్ దొంగిలించారని ఆరోపించిన ఇద్దరు నిందితులు రఘు, చరితలను తన సోదరుడు మనోజ్ నియమించుకున్నారని అన్నారు. అయితే, రఘు మనోజ్ సూచనల మేరకు పనిచేశాడా లేదా అనేది తనకు కచ్ఛితంగా తెలియదని ఆయన అన్నారు.
అయితే ఇప్పుడు కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్ గురించి భైరవం సక్సెస్ మీట్ లో జర్నలిస్టు ప్రశ్నకు సమాధానంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. హార్డ్ డిస్క్ మీకే ఇచ్చాను కదా? అని జర్నలిస్టుల ఎదుట సరదాగా నవ్వేశాడు. తర్వాత కాస్త సీరియస్ గా మారిన మనోజ్.. నేను గతంలో సినిమాపై ఫన్ చేసిన మాట నిజం. కానీ ఒక సినిమా కోసం ఎంతో మంది కష్టపడతారు. కన్నప్పకు గొప్ప విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను! అన్నాడు.