పద్మ పురస్కారాలు-పవన్ అభినందనలు

అయిదు దశాబ్దాలపైబడి తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషదాయకం. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీ బాలకృష్ణ గారు - హిందూపురం శాసన సభ్యుడిగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ గా ఎన్నో సేవలందిస్తున్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో పలు పరిశోధనలు చేసిన డా.డి.నాగేశ్వర్ రెడ్డి గారు పద్మ విభూషణ్ కు ఎంపికైనందుకు అభినందనలు.
ప్రజా ఉద్యమాల్లో శ్రీ మంద కృష్ణ మాదిగ గారికి ప్రత్యేక స్థానం ఉంది. ఎం.ఆర్.పి.ఎస్. ద్వారా మాదిగలకు రిజర్వేషన్ కోసం పోరాడారు. అనారోగ్యంతో బాధపడే పిల్లలకు ప్రభుత్వ వైద్య సహాయం కోసం, వికలాంగుల కోసం ప్రజా పోరాటాలు చేశారు. శ్రీ మంద కృష్ణ మాదిగ గారు పద్మశ్రీ కు ఎంపికైనందుకు అభినందనలు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సహస్రావధాని, కవి శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు, సాహిత్యం-విద్య విభాగంలో ఎంపికైన శ్రీ కె.ఎల్.కృష్ణ గారు, శ్రీ వి.రాఘవేంద్రాచార్య పంచముఖి గారికి అభినందనలు.
మట్టిలో మాణిక్యాలాంటి వారికి పద్మ పురస్కారాలు అందిస్తోంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది 30మంది ఈ విధంగా ఎంపికైనవారు ఉండటం సంతోషాన్ని కలిగించింది. మన రాష్ట్రానికి చెందిన బుర్రకథ కళాకారుడు శ్రీ మిరియాల అప్పారావు గారికి మరణానంతరం పద్మశ్రీకి ఎంపికయ్యారు. వారి కళా సేవకు తగిన గుర్తింపు దక్కింది.
పవన్ కళ్యాణ్
Pawan Kalyan wishes to Padma Award winners
Padma Awards - Congratulations Pawan




































