కేసీఆర్‌ సీఎం అయితే.. రేవంత్‌ కూడా అయినట్లే..!!

CineJosh news

రాజకీయాల్లో కేసీఆర్‌ ఓ కొత్త ఒరవడి సృష్టించారు. తెలుగులో ఎంఏ చేసిన కేసీఆర్‌ మాటలగారడి తెలంగాణ ఉద్యమానికి ఎంతో సాయపడింది. ఇప్పుడు అదే ఆయన్ను సీఎం సీటులో కూర్చోబెట్టినట్లు కూడా విశ్లేషకులు చెబుతుంటారు. మోడీని సన్నాసి అని సంబోధించి కేసీఆర్‌ తాను ఎవర్ని లెక్కబెట్టనని చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో అరెస్టు అయిన రేవంత్‌రెడ్డి కూడా ఇదే బాటను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడు, బీహార్‌, యూపీలో రాజకీయాలు మనకంటే దిగజారినా అక్కడి నాయకులు మాటల వినియోగంలో కాస్త వెనుకముందు చూసుకుంటారు. ఇక ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఈ రాష్ట్రాల కంటే కూడా దిగజారినట్లు కనిపిస్తోంది. తిట్ల పురాణం, దిగజారుడు మాటల వినియోగంతోనే ప్రజలను ఆకర్షించవచ్చన్న నిర్ణయానికి నాయకులు వచ్చినట్లు కనిపిస్తోంది.

ఓటుకు నోటు కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన రేవంత్‌ తన మాటలకు మరిన్ని తిట్లు జోడించి పదును పెంచాడు. టీ-మంత్రులను సన్నాసులు, బద్మాష్‌లు అన్న రేవంత్‌ చివరకు వారు పాతచెప్పులతో కూడా సమానం కాదని విరుచుకుపడ్డాడు. నెలపాటు జైల్‌లో ఉన్న రేవంత్‌ తన కసి తీరా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించాడు. ఇక కేసీఆర్‌ను పదవి దించే వరకూ విశ్రమించేది లేదంటూ టీఆర్‌ఎస్‌ శ్రేణులను మరింత రెచ్చగొట్టాడు. తాను బయటకు రాగానే కేసీఆర్‌కు జ్వరం రావడం మాత్రమే కాదంటూ లాగు కూడా తడస్తోందని వ్యాఖ్యానించి రాజకీయ ప్రసంగాలను కేసీఆర్‌కంటే లోతుకు తీసుకెళ్లాడు. రాజకీయాల్లో వాడు.. వీడు అనడమే తప్పనుకుంటున్న సమయంలో కేసీఆర్‌ సన్నాసులు, చవటలు అంటూ ప్రజాకర్షణ మూటగట్టుకొని సీఎం పదవిని దక్కించుకున్నాడు. ఇక తిట్ల పురణానికి ప్రజలు ఆకర్షితులవుతారంటే మరో పదేళ్లకైనా రేవంత్‌ తప్పక సీఎం అవుతారేమో..?.

revanth reddy
bail
rally
speech
kcr