PR పంచ్ - బూతులు మాయం - అభివృద్ధి ఖాయం

Boothulu mayam-progress is certainBoothulu mayam-progress is certain

2024 ఎలక్షన్స్ లో ఆంధ్రరాష్ట్ర ప్రజలు కసి కసిగా ఓటేశారు. కసితీరా కాటేసారు. వై నాట్ 175 అన్న వైసీపీ కి వైరల్ ఫీవర్లు తెప్పించారు, కూటమికి పట్టం కట్టి పాలనా పగ్గాలు అందించారు.

ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ పరదాల చాటున చేసిన ప్రయాణాన్ని చూసి విసిగిపోయిన జనానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే జనాల్లోకి వచ్చేసి, జరిగిన డ్యామేజ్ ని పూడ్చడానికి సంక్షేమం వైపు రాష్ట్రాన్ని నడిపించడానికి చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు మరియు ఈ వయసులోనూ ఆయన చూపిస్తున్న చలాకీతనానికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.  అటు వైపు నారా లోకేష్ ఇంకా ఆయన చేతిలోని రెడ్ బుక్ ఓపెన్ చెయ్యకపోయినా ఇప్పటికే ప్రత్యర్థుల వెన్నులో ఒణుకుపుట్టిస్తున్నాడు. తప్పు చేసిన ఏ ఒక్కడిని కూడా ఇంటి గుమ్మం దాటి బయటికి వచ్చే పరిస్థితి లేని సందర్భాన్ని సృష్టించాడు. 

ఇదే తరహాలో ఇతర ప్రజాప్రతినిధులంతా పెండింగ్ లో ఉన్న పనులని ఇప్పటికే మొదలు పెట్టేసారు. రాష్ట్రంలో ఎటు చూసినా ప్రతి ఊరులో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో పరుగులు పెడుతూ పభుత్వ యంత్రాంగం కదులుతుంది. పదే పది రోజుల్లోనే ఈ తరహా మార్పులు చూసిన ప్రజానీకం కూటమి ప్రభుత్వానికి జేజేలు పలుకుతుంది. 

ఇక చంద్రబాబు తో సమాన స్థాయి హోదాని పొందుతున్న పవన్ కళ్యాణ్ నేడు ఉప ముఖ్యమంత్రిగా తన ఛాంబర్ కి చేరుకున్నారు. తనకి కేటాయించిన శాఖల బాధ్యతలను అధికారికంగా చేపట్టారు. రాష్ట్ర రాజకీయాలని నిర్దేశించగలిగిన రెండు అగ్ర కులాల కలయిక నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తోంటే.. ఈ కృష్ణార్జునులు సాహచర్యం, సాన్నిహిత్యం రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రగతికి ఎంతగా దోహద పడుతుందో స్పష్టమవుతుంది. తమ ఓటమికి సాకులు కూడా సరిగ్గా చెప్పుకోలేని వైసీపీ నేతలు EVM పై ఈకలు పీకుతుంటే సుప్రీం కోర్ట్ సూటిగా, ఘాటుగా మొట్టికాయలేసింది. అఫ్ కోర్స్ వైసీపీ కి కోర్టుల చీవాట్లు కొత్తేమి కాదుగా.. 

ఇక ఇవన్నీ పక్కనపెడితే వైసీపీ ని మళ్ళీ తిరిగి రాలేని రీతిలో తిప్పి కొట్టిన ఆంధ్ర ప్రజలు గత కొన్ని రోజులుగా ప్రశాంతమైన రాష్ట్రాన్ని చూస్తున్నారు. ప్రభావవంతమైన రాజకీయాల్ని చూస్తున్నారు. పేరుకి పెద్ద హోదాలో ఉండి దద్దమ్మలు వేసే వెకిలి డాన్స్ లు చూసే కష్టం కళ్ళకి తప్పింది. చేతిలో రిమోట్ ఉన్నా, ఛానల్స్ మార్చుతున్నా ఈ రాజకీయ నాయకుల బూతులు వినిపిస్తూనే ఉంటే విరక్తి కలిగే దౌర్భాగ్యం పోయింది. ఇది ఇక్కడికే పరిమితం కాలేదు, నిన్నమొన్నటివరకు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని అమ్మ, అక్కా, చెల్లి అనే తేడాల్లేకుండా, అడ్డు అదుపు లేకుండా వాడే భాష పట్ల విచక్షణ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది వాగేసిన వ్యక్తులందరూ నవరంధ్రాలు మూసేసుకున్నారు. ఐ ప్యాక్ హ్యాండిల్స్ అన్నీ అదృశ్యమయ్యాయి. అడ్డగోలు వ్యవహారాలన్నీ కనుమరుగయ్యాయి. 

ఇప్పుడు ఈ క్షణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్ పట్టుకున్న పిల్లల దగ్గర నుంచి పెన్షన్ అందుకుంటున్న పెద్దల వరకు అందరిలోనూ ఒకే భావన కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఖాయమనే మాటే వినిపిస్తోంది. కరోనా కాలం ప్రజలని కొంతకాలమే వేధించిందట. అంతకు మించిన కక్ష సాధింపు చర్యలు ఒక సైకో పాలనలో చూశామంటూ.. నేటికి తమకు విముక్తి లభించిందంటూ జనం చెబుతున్న మాటలే జగన్ పాలన ఎలా సాగిందో అర్ధమయ్యేలా చేస్తుంది. దానితో పోల్చుకుంటే చంద్రబాబు-పవన్ గోరంత అభివృద్ధిని చూపిస్తేనే.. కొండంత ఆనందంతో ఉప్పొంగేలా ఉన్నారు ఆంధ్రులు. 

- పర్వతనేని రాంబాబు✍️

PR Punch - Chandrababu and Pawan Kalyan started work

chandrababu