తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్: విజయ్

‘ఖుషి’ మూవీ టీమ్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ‘ఖుషి’ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు తీసుకునేందుకు.. హీరో విజయ్ దేవరకొండ, ఆయన పేరెంట్స్, తమ్ముడు ఆనంద్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు.

స్వామివారి దర్శనం అనంతరం హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ ఏడాది మా ఫ్యామిలీకి చాలా కలిసొచ్చింది. మా బ్రదర్ బేబీ మూవీ, నేను నటించిన ఖుషి రెండు సక్సెస్ అయ్యాయి. అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు మా కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నాను. కొన్నేళ్ల కిందట నేను యాదాద్రికి వచ్చినప్పుడు గుడి ఇంత బాగా లేదు. పునర్నిర్మాణంలో యాదాద్రిని అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే ఏ ఇబ్బందీ లేకుండా దర్శనం చేసుకునేలా చేసిన ఆలయ అధికారులు, పోలీసులకు కూడా థ్యాంక్స్. మా మైత్రీ సంస్థకు కూడా ఈ ఏడాది కలిసొచ్చింది. వాళ్ల రెండు సినిమాలకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు ఖుషి హిట్ అయ్యింది. మాలాగే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని కోరుకున్నానని తెలిపారు.

అనంతరం ‘ఖుషి’ దర్శకుడు శివ నిర్వాణ.. నిర్మాతలు వై రవి శంకర్, నవీన్ యెర్నేని యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఖుషి టీమ్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kushi Team took the blessings of Lakshmi Narasimha Swamy In Yadadri

Kushi Team visited Yadadri Temple
kushi
yadadri
lakshmi narasimha swamy
vijay deverakonda