ఆ వార్త నన్నెంతో కలిచివేసింది: బాలకృష్ణ

రెబల్ స్టార్ కృష్ణంరాజుతో బాలకృష్ణకు మంచి అనుబంధమే ఉంది. ఆయనతో బాలయ్య రెండు సినిమాలు చేశారు. ‘వంశోద్ధారకుడు, సుల్తాన్’ వంటి చిత్రాలలో వీరిరువురు కలిసి నటించారు. కృష్ణంరాజు ఫ్యామిలీతో కూడా నందమూరి ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మరణ వార్త తనని ఎంతగానో కలిచివేసిందని బాలయ్య తెలియజేశారు. ఇటీవల ఆయన అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నప్పుడు కూడా వెళ్లి కలిశానని, తరచూ ఆయన హెల్త్ గురించి తెలుసుకునే వాడినని, కానీ సడెన్గా ఇలా ఆయన అనంతలోకాలకు చేరుకోవడం చాలా బాధగా ఉందంటూ.. బాలయ్య మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు.
‘‘మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు గారి మరణం తీవ్రంగా కలిచివేసింది. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు గారిది చెరగని ముద్ర. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు కృష్ణంరాజు గారు. కృష్ణంరాజు గారితో కలసి రెండు చిత్రాలలో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం. కృష్ణంరాజు గారితో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. కృష్ణరాజు గారు అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నప్పుడు వెళ్లి కలిశాను. ఆయన ఆరోగ్యం గురించి తరచూ తెలుసుకునేవాడిని. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..’’ అని బాలకృష్ణ ఈ లేఖలో పేర్కొన్నారు. కాగా, కృష్ణం రాజు అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం తరువాత జరుగుతాయని కుటుంబ సభ్యులు తాజాగా వెల్లడించారు.
Balakrishna Letter on Krishnam Raju Death
Balakrishna Pays Tribute to Krishnam Raju




































