మారిన కీర్తిసురేష్ కొత్త చిత్ర టైటిల్.. ఏంటంటే?

థియేటర్స్ ఓపెన్ కాగానే జానకితో నేను
సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ కథానాయకుడిగా, కీర్తిసురేష్ కథానాయకిగా తెరకెక్కిన చిత్రానికి ‘జానకితో నేను’ అనే టైటిల్ను ఖరారు చేశారు. తొలుత దీనికి ‘ఐనా...ఇష్టం నువ్వు’ అన్న పేరు పెట్టిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ‘జానకితో నేను’ అనే టైటిల్ మరింత బావుంటుందన్న ఉద్దేశ్యంతో ఈ మార్పు చేశారు. ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌతు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై అడ్డాల చంటి నిర్మిస్తున్నారు. నాగబాబు కీలక పాత్రలో నటించగా... రాహుల్ దేవ్ విలన్ గా కనిపిస్తారు.
ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయని, నాలుగైదు రోజులు ప్యాచ్ వర్క్ చిత్రీకరణ మాత్రమే మిగిలివుందని, త్వరలో దానిని కీర్తిసురేష్ పైన చిత్రీకరిస్తామని నిర్మాత అడ్డాల చంటి తెలిపారు.
ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయని, అక్టోబర్ మొదటి వారానికి తొలికాపీ సిద్ధమౌతుందని ఆయన చెప్పారు. థియేటర్స్ ఓపెన్ కాగానే అనువైన తేదీన చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన వివరించారు. నవీన్, కీర్తిసురేష్లు తమ పాత్రలలో ఎంతగానో ఒదిగిపోయారని.. దర్శకుడు సన్నివేశాలన్నిటిని హృదయాలకు హత్తుకునేలా మలిచారని ఆయన చెప్పారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో సప్తగిరి, కొండవలస, చాందిని, ఫణి, రఘు తదితరులు తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సురేష్, సంగీతం: అచ్చు, నిర్మాత: అడ్డాల చంటి, దర్శకత్వం: రాంప్రసాద్ రౌతు.
Keerthi Suresh and Nawin vijaya krishna title is Janaki tho nenu
keerthi suresh new movie title changed







































