ఉగాది రోజున బాంబ్ పేల్చబోతున్న పృథ్వీ!?

టాలీవుడ్ కమెడియన్, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వైసీపీకి చేసిన సేవలకు గానూ.. పిలిచి మరీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ పదవిని పట్టుమని పది నెలలు కూడా అనుభవించకుండానే ‘గట్టిగా వాటేసుకుందామనుకున్నా..’ అనే ఒక్క ఆడియో క్లిప్తో పొగొట్టుకున్నాడు. ఎస్వీబీసీ చైర్మన్ పదవి అంటే ఆషామాషీ కాదు.. అలాంటిది పృథ్వీకి జగన్ ఇవ్వడం నిజంగా చాలా గ్రేట్.. కానీ ఇచ్చిన అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకున్నాడు. అయితే.. తనకూ ఆ రాసలీలల ఆడియో టేప్కు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడే తప్ప ఇంతవరకూ రుజువు చేసిన దాఖలాలు మాత్రం లేవ్.. అసలు అది జరిగే పనో కాదో కూడా తెలియట్లేదు.
తాజాగా.. ఓ ప్రముఖ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి ఈ పదవి ప్రస్తావన వచ్చింది. కచ్చితంగా తాను ఏ పదవైతే పోగొట్టుకున్నానో మళ్లీ అదే ఎస్వీబీసీ చైర్మన్ కుర్చీలో కూర్చుంటానని గట్టి ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాదండోయ్.. మొదట్నుంచి తాను ఓ పెద్ద మనిషి వల్లే ఈ పదవి కోల్పోవాల్సి వచ్చిందని.. ఆయనే కుట్ర చేశారని చెబుతూ వస్తున్న సంగతి తెలిసందే. అయితే ఆ పెద్ద మనిషి ఎవరో చెప్పేస్తానంటున్నాడు పృథ్వీ. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాడోయ్. ఆ పెద్ద మనిషి ఎవరో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా తెలుసంట. ఉగాది పండుగ రోజున తనపై కుట్ర పన్నిన ఆ పెద్ద మనిషి పేరు పృథ్వీ చెప్పేస్తాడట.
పృథ్వీ చెప్పిన ఈ మాటలతో ఇంతకీ ఆయనెవరు..? పృథ్వీ నోట ఎవరి పేరు రాబోతోంది..? సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనా..? లేకుంటే పొలిటికల్గా ఎవరి పేరైనా చెబుతారా..? అనేదానిపై వైసీపీ కార్యకర్తలు, ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. పృథ్వీ చెప్పే పేరు ప్రత్యర్థులదైతే ఆయన అంతు చూడటానికి కూడా వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు వేచి చూస్తున్నారు. మొత్తానికి చూస్తే ఈ వ్యవహారానికి ఉగాది అనగా 25తో ఫుల్ స్టాప్ పడబోతోందన్న మాట. జస్ట్ వెయిట్ అండ్ సీ.
News About Thirty Years Industry Prudhvi Raj!
News About Thirty Years Industry Prudhvi Raj!








































