‘రంగస్థలం’ అవార్డ్ను నూర్కు అంకితమిచ్చిన చెర్రీ

గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ మహ్మద్ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి హటాహుటిన తన అభిమాని ఇంటికి చేరుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకుగాను అన్ని విధాలా అండగా ఉంటామని అభయమిచ్చి.. రూ. 10 లక్షలు విరాళం ఇస్తున్నట్లు మెగా పవర్స్టార్ రామ్చరణ్ ప్రకటించారు. చెర్రీ అందుబాటులో లేకపోవడంతో నూర్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేకపోయారు. ఈ సందర్భంగా మెగా హీరోలందరూ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.
నూర్ మృతితో చలించిపోయిన చెర్రీ.. సూపర్ డూపర్ హిట్టయిన ‘రంగస్థలం’ చిత్రంలో తన నటనకు గాను వచ్చిన ‘బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్’ అవార్డును వీరాభిమానికి అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. చెన్నైలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న చెర్రీ ఈ అవార్డు అందుకున్నాడు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు. ‘నూర్ గొప్ప వ్యక్తి. నన్ను, నాన్నగారిని ఎంతో అభిమానిస్తూ ప్రోత్సహించేవారు. ఆయన ఇప్పుడు మనమధ్యలేరు. ఈ అవార్డ్ నూర్ ఇచ్చినట్టే అనిపిస్తోంది. నూర్కు ఈ అవార్డు అంకితం ఇస్తున్నాను. మేం మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నాం సర్. మిమ్మల్ని మిస్సవుతున్నాం..’ అంటూ చెర్రీ భావోద్వేగాని లోనై ఏడ్చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించి‘టీమ్ రామ్చరణ్ వైజాగ్’ పేరిట ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన మెగాభిమానులు చెర్రీని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు హ్యాట్సాప్ చెర్రీ సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Ram Charan Dedicates his award to late fan Noor Mohammad
Ram Charan Dedicates his award to late fan Noor Mohammad









































