తెలుగు ఓటర్ల గురించి పవన్‌‌కి తెలియదా?

పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నించడానికే రాజకీయాలలోకి వచ్చానన్నాడు. కానీ కిందటి ఎన్నికల్లో పోటీ చేయకుండా టిడిపి-బిజెపి కూటమికి మద్దతు ఇచ్చాడు. ఇక ఈసారి మాత్రం ఆయన పూర్తిగా తెలుగుదేశంకి దూరమయ్యాడని ఇప్పటివరకు ఆయన మాట్లాడిన మాటలు వింటే ఓ నిర్ణయానికి వచ్చేయచ్చు. తాజాగా ఈ విషయాన్ని ఆయన మరోసారి బహిరంగంగానే తెలిపాడు. ఆయన జంగారెడ్డి గూడెంలో మాట్లాడుతూ, మీరు 25కోట్లు ఖర్చుపెట్టండి.. 50కోట్లు ఖర్చుపెట్టండి. 2019లో తెలుగుదేశం అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యత జనసేనదేనని ప్రకటించాడు. 

మరోవైపు ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో శరవేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2019లో టిడిపి గానీ వైసీపీగానీ సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తుందా? లేక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా? అనేది కాలమే నిర్ణయిస్తుంది... అని తెలిపాడు. ఒకవైపు టిడిపిని గెలవనివ్వమని చెబుతూనే తమ సాయం లేకుండా టిడిపి, వైసీపీలలో ఏవీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని ఆయన చెబుతున్నమాటలు వింటుంటే వచ్చే ఎన్నికల తర్వాత వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తే ఆయన సంకీర్ణప్రభుత్వంగా వైసీపీకే మద్దతు ఇవ్వడం ఖాయం అనేది ఈ వ్యాఖ్యల పరమార్ధంగా అర్ధం అవుతుంది. 

టిడిపి, వైసీపీ రెండు దోపిడీ, అవినీతి ప్రభుత్వాలే అయినప్పుడు సమదూరం పాటించి తాము తక్కువ సీట్లు వస్తే ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పకుండా తమ మద్దతు మీదనే ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పడం చాలా లోతైన విషయం. ఇక ఇంకా ఆయన మాట్లాడుతూ, నాకు జీవితాన్ని ఇచ్చిన అన్నను కూడా కాదని టిడిపికి మద్దతు ఇచ్చాను. ఎందుకిచ్చానా? అని ఇప్పుడు రోజూ బాధపడుతున్నానన్నాడు. మరి వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీకి మద్దతు ఇచ్చిన తర్వాత మరలా ఆయన ఇలాగే బాధపడే రోజు రాదని నమ్మకం ఏమిటి? చంద్రబాబు, జగన్‌లలో పెద్దదొంగ, అవినీతిపరుడు జగనేనని ఎవరైనా ఒప్పుకుంటారు. మరి పవన్‌ చంద్రబాబునే కాకుండా జగన్‌ని ఎందుకు విమర్శించడం లేదు. 

చంద్రబాబు ఇప్పటివరకు పవన్‌పై వ్యక్తిగతంగా, ఆయన వైవాహిక జీవితంపై ఎక్కడా విమర్శలు చేయలేదు. కానీ జగన్‌ అలా కాదు. పవన్‌ వైవాహిక జీవితాలను కూడా విమర్శించాడు. మరి పవన్‌ ఇక్కడ జగన్‌ స్టాండ్‌ తీసుకోవడానికి కారణం ఏమిటి? జగన్‌, బిజెపిలు ఒప్పుకున్నా కాదన్నా ఈ రెండు ఎన్నికల అనంతరం కలవడం ఖాయం. మరి పవన్‌ వైసీపీ మద్దతు ఇస్తే బిజెపికి, మోదీకి కూడా మద్దతు ఇచ్చినట్లే కదా...! ఇక పవన్‌ మాట్లాడుతూ.. 30,40 సీట్లు వచ్చిన వారు ముఖ్యమంత్రి కాగలరని ఎవరైనా ఊహించారా? అన్నాడు. అంటే పవన్‌పై కర్ణాటక ఎన్నికలు, ఫలితాలు బాగా ప్రభావం చూపాయనే అర్ధమవుతోంది. కుమారస్వామి స్థానంలో ఏపీలో తనని తాను ఊహించుకుంటున్నట్లుగా ఉంది. ఇప్పటి వరకు సమైక్యాంధ్రలో ఎన్నడు సంకీర్ణాలు రాలేదు. అంటే తెలుగు ఓటర్లు ప్రతి సారి ఖచ్చితంగా ఒక స్టాండ్‌ తీసుకుని ఓటేస్తారు అనేది పవన్‌ విస్మరిస్తున్నాడు. 

ఇక పవన్‌ నాడు కేసీఆర్‌ కోసం ఎంతో వెయిట్‌ చేసి ఆయనను కలిసి వచ్చాడు. ముందుగా ఎన్నికలకు వెళ్లి రాజకీయ వేడిని రాజుకున్న తెలంగాణ విషయంలో మాత్రం పవన్‌ స్పష్టత ఇవ్వడం లేదు. ఇటీవల తాను తెలంగాణలోని బిసీ నాయకులతో మంతనాలు జరుపుతున్నానని చెప్పాడు. కానీ తాజాగా ఆయన తెలంగాణ ప్రాంతం గుండా పోతూ అశ్వరావు పేటలో 10 నిమిషాలు ప్రసంగిస్తాడని వార్తలు వచ్చినా ఏమీ మాట్లాడకుండా అభివాదం చేసుకుంటూ వెళ్లాడు. అసలు పవన్‌ యాత్రను ప్రారంభించింది తెలంగాణలోని కొండగట్టు నుంచే. కరీంనగర్‌లో కేసీఆర్‌ని తెగమెచ్చుకున్నాడు. కానీ నేడు మౌనం వహిస్తున్నాడు. 

అంటే బాబుపై రెచ్చిపోయినా ఏమీ చేయడని అదే కేసీఆర్‌ అయితే తనని విమర్శించిన వారిని ఎలా ఇబ్బంది పెడతాడో హైదరాబాద్‌లో ఆస్తులు, కెరీర్‌ ఉన్న పవన్‌కి బాగా తెలిసొచ్చాయే అనే అనుమానం కూడా కలుగుతోంది. మరోవైపు పవన్‌ బిజెపికి అనుకూలం అనడానికి మరో ఉదాహరణ కూడా ఉంది. బిజెపిని, మోదీని విమర్శించని పవన్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం జనసేన మ్యానిఫెస్టోని కాపీ కొడుతోందని విమర్శిస్తూ ఉండటం దీనికి సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Pawan kalyan did you know.. Telugu Voters Mind Set

Pawan Kalyan Speech at Public Meets
pawan kalyan
speech
telugu voters
public meets