తులసిరెడ్డి చెప్పిన దానిలో తప్పేముంది..!

CineJosh news

స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయినా ఇంకా దళితులకు అన్యాయం జరుగుతూనే ఉందని, తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తమపై దాడులు జరుగుతున్నాయని మందకృష్ణ మాదిగ నుంచి టిడిపి ఎంపీ శివప్రసాద్‌ వరకు అంబేడ్కర్‌ జయంతిరోజున చెప్పారు. కానీ ఈ వ్యాఖ్యలను సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు తులసీరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సాధారణంగా ఇలాంటి భావాలు ఉన్నా కూడా మీడియా ముందు మాట్లాడితే వారిని దళిత వ్యతిరేకులు అంటారు. కానీ తులసిరెడ్డి మాత్రం ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో వచ్చిన కార్యక్రమంలో మండిపడ్డారు. 

ప్రపంచంలో రెండే వర్గాలున్నాయని, అవి పేద, ధనిక మాత్రమేనని తెలిపాడు. దళితుడు కాబట్టే చంపారని వాదించవద్దని, అక్కడ చంపింది ఎవరు? చనిపోయింది ఎవరు? అనేది చూడాలే కానీ.. దయచేసి హత్యారాజకీయాలు చేయవద్దని సూచించాడు. అగ్రవర్ణాల ప్రాణాలకు ఒక విలువ, దళితుల ప్రాణాలకు మరో విలువ ఉండవని, చనిపోయిన వ్యక్తి బాధ, కుటుంబ సభ్యుల ఆవేదన ఒకటేనని ఎలుగెత్తిచాటాడు. రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణులు వంటి వారిపై కూడా దాడులు జరుగుతున్నాయని, దీనికి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలే గానీ దానికి కుల, మతాల రంగు పులమవద్దని కోరాడు. 

కడప, అనంతపురం, శ్రీకాకుళం వంటి జిల్లాల నుంచి ఎందరో అగ్రవర్ణాలు కూడా పని లేక వలస వెళ్లి బతుకుతున్నారని చెప్పాడు. ఇక మనిషి స్వార్థజీవి అని, అవసరమైతే ప్రతి ఒక్కరు కుల, మత, ప్రాంతాలను బాగా వాడుకుంటారని తేల్చాడు. అమెరికాలో ఉంటే మన తెలుగు వారంతా ఒకటి అంటారని, ఇక్కడకు వస్తే మా రాయలసీమ వాడంటారని, ఇంకా అవసరం ఏర్పడితే కడప జిల్లా పేరు వాడుకుంటారని, ఇక చివరకు తాను వేంపల్లి వాడినని, ఆ తర్వాత తన కులం, మతాలను వాడుకుంటారని తేల్చాడు. కానీ వేదికపై ఉన్న దళిత నాయకులు ఆయనపై మాటల యుద్దం చేశారు. తాజా సమాచారం ప్రకారం తులసిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టే ఆలోచనలో కొందరు ఉన్నారు. ఏమిటి? ఈ అన్యాయం...? 

tulasi reddy
backward castes
dr br ambedkar
congress