బాబూ..! తెలంగాణ, ఏపీ పరిస్థితిలు వేరువేరు!

CineJosh news

వైసీపీలోంచి టిడిపిలోకి వచ్చిన వారికి చంద్రబాబు మంత్రి పదవులివ్వడం...దానిని జగన్‌తో సహా, బిజెపి కూడా తప్పుపడుతుండటంతో ఈ విషయం జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. కానీ మన తెలుగు మీడియా మాత్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదు. తలసాని టిడిపి నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి మంత్రి పదవి పొందడానికి ముందే ఆయన సనత్‌ నగర్‌ నియోజక వర్గానికి రాజీనామా చేశాడు. ఈ విషయంలో కేసీఆర్‌ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఇప్పటికీ ఆయన రాజీనామా లేఖ స్పీకర్‌ మధుసూదనాచారి వద్ద పెండింగ్‌లో ఉంది. కానీ ఈ వ్యూహాన్ని చంద్రబాబు మరిచిపోయాడు. మంత్రి పదవులు చేపట్టిన వారిచేత ముందుగానే స్పీకర్‌కు రాజీనామా లేఖలు సమర్పించి, వాటిని ఆమోదించకుండా చేసుకొనివుంటే బాబుకు ఈ అప్రతిష్ట వచ్చేది కాదు...! కానీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిన బాబు తాను మంత్రి పదవులిచ్చిన నలుగురు వైసీపీ ఎమ్మేల్యేలు ముందుగానే రాజీనామా చేశారని  బొంకుతున్నారు. 

ఇక జగన్‌తో పాటు చంద్రబాబుపై కూడా అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ఏలేరు స్కాం, బిగ్‌బాస్‌, ఓటుకునోటు.. ఇలా ఎన్నింటిలోనో ఆయన కూడా ముద్దాయే.,కానీ ఆయన కోర్టు నుంచి ముందుగానే స్టే తెచ్చుకుని, విచారణ జరగకుండా అడ్డుకుంటున్నాడు. వైఎస్‌ విజయమ్మ.. చంద్రబాబు అక్రమార్జనపై కోర్టులో కేసు వేసినప్పుడు రామోజీరావు, మురళీమోహన్‌, నామా నాగేశ్వరరావు వంటి వారు కోర్టుకి వెళ్లి, దీనిపై విచారణ అన్యాయమని వాదించారు. చివరకు కోర్టు కూడా పోలీస్‌కేసు నమోదుకాలేదని, మరికొన్ని సాంకేతిక కారణాలతో ఆ విచారణను ఆపివేసింది. ఇక వైఎస్‌ హాయాంలో కూడా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, టిడిపిల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు ఉన్నారు. కానీ వారికెవ్వరికీ వైఎస్‌ మంత్రి పదవులు ఇవ్వలేదు. ఇక తెలంగాణలో ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారందరూ టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. టీటీడీఎల్పీని స్వయంగా నాటి నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు టిఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేశాడు. కానీ ఈ వాదనను సమర్ధంగా వినిపించంలో జగన్‌ విఫలమవుతున్నాడు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే అందరూ దొంగలే.. అనే మాట గుర్తుకొస్తోంది. 

chandrababu tdp
ap cm
ys jagan
talasani
tdp ministers