మెగాభిమానులకు మరో శుభవార్త..!

CineJosh news

వెండితెరపై తమ అభిమాన మెగాస్టార్‌ను పూర్తి స్థాయిలో చూసి దాదాపు దశాబ్దం కావస్తోంది. దీంతో ఆయన తాజాగా నటించిన 'ఖైదీ' చిత్రానికి ఎక్కడలేని క్రేజ్‌, కలెక్షన్లు వస్తున్నాయి. ఇక చిరు తన 151వ చిత్రాన్ని త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. కానీ అప్పటివరకు మెగాస్టార్‌ను మరోసారి చూడాలంటే ఓపిక పట్టాల్సిన అవసరం లేదు. ఆయన హోస్ట్‌గా నటించిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాం సీజన్‌4 త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనుంది. 

వాస్తవానికి ఈ కార్యక్రమం ఎప్పుడో ప్రారంభం కావాల్సివుంది. కానీ చిరు రీఎంట్రీ మూవీ కోసం ఆయనే ఈ కార్యక్రమం విషయంలో నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చి, తన 'ఖైదీ' విడుదల అయిన తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకోవాలని వాయిదా వేయించాడు. ఇక ఈ కార్యక్రమం తొలి ఎపిసోడ్‌ ఫిబ్రవరి13 రాత్రి 9.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. కాగా ఈ కార్యక్రమం చిరంజీవి వల్ల సౌత్‌ టెలివిజన్‌ రంగంలోనే అత్యధిక టీఆర్పీలు సాధిస్తుందనే నమ్మకం అందరిలో ఉంది. మరోపక్క దీనికి గాను ఒక్కో ఎపిసోడ్‌కు చిరు 10లక్షలకు పైగా రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. 

ఇది సౌత్‌ ఇండియాలోనే రికార్డు. మరి చిరు చేతుల మీదుగా తొలి గెలుపు మొత్తాన్ని అందుకోబోయే అదృష్టవంతుడు ఎవరా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 'కౌన్‌బనేగా కరోడ్‌పతి'ని అమితాబ్‌ హోస్ట్‌ చేసిన కార్యక్రమానికి తదుపరి సీజన్‌లలో కూడా కొందరు బాలీవుడ్‌ స్టార్స్‌ హోస్ట్‌ చేసినప్పటికీ అమితాబ్‌ని మించి మెప్పించలేకపోయారన్నది వాస్తవం. మరి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి తొలిహోస్ట్‌గా పనిచేసిన నాగ్‌ అందులో బాగా మెప్పించాడు. మరి చిరు తన వాక్చాతుర్యంతో, హావభావాలతో నాగ్‌ను మెప్పించగలడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...!  

mega fans
chiranjeevi
tv show
meelo evaru koteeswarudu program
start on 13th feb 2017 at 9.30pm