మోక్షు ఎంట్రీకి ..బాలయ్య ప్లానింగ్ రెడీ..!

CineJosh news

గత కొన్ని రోజులుగా బాలకృష్ణ కొడుకు, నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ త్వరలోనే వుంటుందనే ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వార్తలని బాలకృష్ణ కూడా దాదాపు ఖరారు చేసాడు. తన తాజా చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విజయోత్సాహ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాలకృష్ణ, మోక్షజ్ఞ త్వరలోనే  టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పాడు. ఇక మోక్షజ్ఞ ఎలాంటి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతాడా.. అని నందమూరి అభిమానులతో పాటే.. అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఒక చారిత్రాత్మక కథతోనే మోక్షు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. 

ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చే సినిమా కథపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చేశాయి. 'గౌతమీపుత్ర శాతకర్ణి' విజయంతో ఊపుమీదున్న బాలయ్య ఆ శాతకర్ణి కుమారుడు పులోమావి కథనే మోక్షు మొదట సినిమాగా తీయాలని నిర్ణయించాడని సమాచారం. ఇక 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం యుద్ధ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి... ఈ పులోమావి కథను ఒక ప్రేమ కథగా మలిచి చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఈ కథ ఏమిటనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తున్నారు సదరు గాసిప్ రాయుళ్లు.

అదేంటంటే వాశిష్టి శాతకర్ణి కొడుకు పులోమావి.. శ్రావణి అనే అమ్మాయిని ప్రేమిస్తాడట. దానిలోని చారిత్రక అంశాల ఆధారంగా సినిమాని మలుస్తారని అంటున్నారు. పులోమావి, శ్రావణి ప్రేమకథ ఆధారంగా ప్రముఖ రచయిత ముదిగొండ శివప్రసాద్ రచించిన 'శ్రావణి' అనే నవలను ఆధారంగా చేసుకుని సినిమా తీస్తారని అంటున్నారు. ఇక ఆ కథకు అదే నవలా టైటిల్ ని 'శ్రావణి' అని పెడతారని టాక్. ఇక ఈ 'శ్రావణి' చిత్రానికి డైరెక్టర్ ని కూడా బాలకృష్ణ ఇప్పటికే ఫిక్స్ చేసాడనే వార్తలొస్తున్నాయి. 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని విజయపథంలో దూసుకుపోయేలా చేసిన డైరెక్టర్ క్రిష్ నే మోక్షజ్ఞ మొదటి చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని చెబుతున్నారు. ఇక దాదాపు ఈ చిత్రం కన్ఫర్మ్ అయినట్లే వార్తలొస్తున్నాయి. చూద్దాం ఇదైనా నిజామా... లేక అన్నిటివలె గాసిప్పా.. అనేది.

mokshagna
balayya
gautamiputra satakarni
krish
sravani
pulomavi