ఆ పాటి ఆర్టిస్టులు తెలుగులో లేరా ?

CineJosh news

టాలీవుడ్ తీరు చిత్రంగా ఉంటుంది. మన స్టార్స్ తో తీసే సినిమాల్లో విలన్స్ ను మాత్రం ఇతర భాషల నుండి దిగుమతి చేసుకుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు అనేక మంది ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం వేరే వారికి దక్కుతుండడం గమనార్హం. ఇటీవలే విడుదలైన 'శాతకర్ణి'లో ముఖ్యపాత్రలను హేమమాలిని, కబీర్ బేడీ తన్నుకుపోయారు. 'బాహుబలి'లో అతి ప్రధాన కట్టప్ప పాత్ర సత్యరాజ్ కు దక్కింది. కె.రాఘవేంద్రరావు తీస్తున్న 'ఓం నమో వేంకటేశాయ'లో వెంకన్న పాత్రను టీ వీ నటుడు సౌరభ్ జైన్ చేస్తున్నాడు. ఆ మధ్య విడుదలైన ధృవలో కీలక పాత్ర అరవింద్ స్వామికే ఇచ్చారు. 'ఖైదీ నంబర్ 150'లో విలన్ పాత్రని తరుణ్ అరోరా దక్కించుకున్నాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అనేక చిత్రాల్లో తెలుగు నటులకు అన్యాయమే జరుగుతోంది. ఈ విషయమై క్యారక్టర్ నటులు ఆగ్రహంతో ఉన్నారు. తెలుగు టీవీ రంగంలో అనేక మంది సమర్థులైన నటులున్నా సరే ముంబాయి నుండి సౌరభ్ జైన్ కు వేంకటేశ్వర స్వామి క్యారెక్టర్ దక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ పాటి ఆర్టిస్టులు తెలుగులో లేరా?  అని టీవీ తారలు ప్రశ్నిస్తున్నారు.

విలన్ అంటే కరకుదనం ఉండాలి. ఆరడుగుల పొడవుండాలంటూ తెలుగు వారికి పరిచయం లేని వారితో పాత్రలు చేయిస్తున్నారు. ఈ ద్వందనీతి ఏమిటో అర్థం కాదు. కళాకారులకు భాషా భేదం లేదనే సాకుతో స్థానికులకు మొండిచెయ్యి చూపిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్లు అందరూ ఉత్తరాది నుండి దిగిమతి అవుతున్నారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుల అవకాశాలు కూడా వారికే దక్కితే నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉంది.మరి ఈ విషయంలో మా ఎలాంటి అడుగు వేస్తుందో చూడాలి.

telugu artists
tollywood
om namo venkatesaya movie
nagarjuna
director raghavendra rao