రానాతో పోటీకి సిద్దమైన యంగ్‌హీరో..!

దగ్గుబాటి రానా హీరోగా సోలోహిట్‌ కొట్టాలనే కసితో చేస్తున్న చిత్రం 'ఘాజీ'. కాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17వ తేదీన తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఒకే రోజున భారీ ఎత్తున రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు మొదలైన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ వావ్‌... అనిపిస్తూ రాజమౌళితో పాటు పలువురి నుండి ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రానికి హాలీవుడ్‌ చిత్రాల రేంజ్‌లో అవుట్‌పుట్‌ వచ్చిదంటున్నారు. నిన్నటివరకు అందరూ ఆ తేదీన రానా సోలోగా వస్తాడని భావించారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఓ యంగ్‌హీరో కూడా తన తాజా చిత్రాన్ని అదే తేదీన విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు..! 'ఉయ్యాల...జంపాలా' చిత్రం నుంచి చిత్ర చిత్రానికి వైవిద్యభరితమైన పాత్రలు చేస్తూ, విభిన్న కథాంశాలు ఎంచుకుంటున్న రాజ్‌ తరుణ్‌. తాజాగా ఆయన ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో సుంకర రామబ్రహ్మం నిర్మాణంలో 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఇందులో 'మజ్ను' ఫేమ్‌ అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి 'దొంగాట' ఫేమ్‌ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు. 'ఖైదీ...' 'గౌతమీ..' చిత్రాలతో టాప్‌రైటర్‌గా మారిపోయిన సాయిమాధవ్‌ బుర్రా ఇందులో విభిన్నంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఉండేలా అందించిన సంభాషణలు ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ అవుతాయంటున్నారు. కుక్కల కిడ్నాపర్‌గా ఇందులో రాజ్‌ తరుణ్‌ నటిస్తుండగా, 'ఘాజీ'లో రానా నావికాదళ అధికారిగా నటిస్తున్నాడు. 'ఘాజీ' వాస్తవ ఘటనల నేపథ్యంలో సీరియస్‌గా సాగే సబ్జెక్ట్‌ కాగా, 'కిట్టు....' చిత్రం మాత్రం విభిన్నమైన కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుండటంతో ఒకే రోజు రెండు విభిన్న చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అవుతుండటం విశేషం. 'ఘాజీ'లాగానే 'కిట్టు...' చిత్రం టీజర్‌ కూడా మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. 

daggubati rana
ghazi movie
raj tarun
kittu vunnadu jagratha movie
two movies release on feb 17th 2017