తెరాస వల్లే ఏపీ బాగుపడుతోందన్న కేటీఆర్

CineJosh news

నిజమే..... తెలుగు ప్రజలంతా సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పేరు మోసిన సంస్థ కానీ, పరిశ్రమకానీ, విద్యాసంస్థ కానీ సీమాంధ్రలో లేకపోవడం కేవలం రాజకీయ నాయకుల నిర్లక్ష్య వైఖరికి తార్కాణంగా చెప్పవచ్చు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడిప్పుడే సంస్థలు వస్తున్నాయి. పరిశ్రమలు తెచ్చి పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్నాళ్ళు నాయకుల ఏమరపాటు తనంతో, కేవలం స్వప్రయోజనాలను సాధించుకోవడంలో భాగంగా ఒక్క హైదరాబాద్ కేంద్రంగానే విలసిల్లిన పెట్టుబడులు, అభివృద్ధి, విద్యాసంస్థలు, పరిశ్రమలు ఒక్కొక్కటిగా సీమాంధ్రాలోనూ కొలువుతీరుతున్నాయి. తీరాలి కూడానూ.  ఇన్ని రోజుల్లా అన్నింటికీ హైదరాబాద్ పరిగెత్తాల్సిన అవసరం ఇప్పుడు సీమాంధ్ర ప్రజలకు తీరుతోంది. ఒక్క నాయకులు, పెట్టుబడీ దారులు, వ్యాపారులకు తప్ప. ఈ నేపధ్యంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో ప్రసంగంపై కొంతమంది తెరాస నాయకులు సంచలన వ్యాఖ్యలు చేయడంపై ఆసక్తి నెలకొంది. పవన్ పై తెలంగాణా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏగూటి పక్షులు ఆగూటికే చేరుతాయని, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమైందని ఈ విషయం ఆయన జరిపిన కాకినాడ సభ ద్వారా తేటతెల్లమైందని వెల్లడించాడు.

తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ 11 రోజులు అన్నం తినలేదన్న వ్యాఖ్యలు విని తెలంగాణ ప్రజలు బాధపడరా అని కేటీఆర్ ప్రశ్నించాడు. కేటీఆర్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇంతా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకొని ఆంధ్రా నాయకులు కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారని, ప్రజల్లో ఏపార్టీకి ఆపార్టీ పరపతి పెంచుకోవడానికి ప్రయత్నిస్తుందని, అన్ని పార్టీల యావ అధికారమే పరమావధిగా కనిపిస్తుందని వెల్లడించాడు. ఈ విషయంలో ప్రత్యేక హోదా సాధించేందుకు ఏపీలో ఏ నాయకుడికి చిత్తశుద్ధి లేదని ఆయన తెలిపాడు. అలాగే ఏపీకి ఇన్ని విద్యాసంస్థలు, విమానాశ్రయాలు, ప్యాకేజ్ లు వస్తున్నాయంటే అది కేవలం టిఆర్ఎస్ పార్టీ ఘన విజయంలో భాగంగానే అని చెప్పాలి అన్నాడు. చూడండి... తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కారణంగా  ఏపీ ఎన్ని ప్రయెజనాలను పొందుతుందో... అంటూ వ్యాఖ్యానించాడు. ఆంధ్రప్రదేశ్ కు తెరాస అన్ని విధాలా న్యాయం చేసిందని కేటీఆర్ తెల్పడం విశేషం.

ktr
telangana
ap development
ktr statement
industries
colleges