టిడిపి 'గ్రేట్‌ ఎస్కేప్‌'...!

CineJosh news

ప్రస్తుతం తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌, ఏపీలో టిడిపిలు చేస్తున్నది ఒక్కటే. ప్రతిపక్షాల నుండి నాయకుల వలసలను ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి అవి పనిచేస్తున్నాయి. దీంతో ఉప ఎన్నికలు, ఇతరత్రా అప్పుడప్పుడు వస్తున్న ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్ధులను ఓటర్లు గెలిపించినా, ఆ నాయకులు మరలా అధికారపార్టీలోకి ఫిరాయిస్తారని, కాబట్టి ఇష్టం ఉన్నా లేకున్నా అధికార పార్టీలనే గెలిపిస్తే మంచిదని ఓటర్లు భావిస్తున్నారు. ఇక తెలంగాణలో టిటిడిపి దాదాపు కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉంది. తమకు ఎంతో పట్టు ఉన్న భాగ్యనగరంలోని కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. కాగా వాస్తవానికి తెరాస పార్టీ ఆంధ్రా పార్టీలుగా చెప్పుకునే టిడిపి, వైయస్సార్‌సీపీలకు తెలంగాణలోని మిగిలిన జిల్లాల కంటే ఖమ్మంలోనే ఎక్కువ బలం ఉంది. అంతేకాదు.. ఈ జిల్లా వామపక్ష పార్టీలకు కంచుకోట. ఈ నేపథ్యంలో పాలేరు నియోజకవర్గ సిట్టింగ్‌ ఎమ్మేల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరుగుతోంది. సంప్రదాయం ప్రకారం సిట్టింగ్‌ ఎమ్మేల్యే చనిపోతే వచ్చే ఉప ఎన్నికల్లో వారి కుటుంబసభ్యులు పోటీ చేస్తే వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతోంది. కానీ ఈ సారి అధికార పక్షమైన టిఆర్‌ఎస్‌ ఏకగ్రీవానికి సముఖంగా లేదు. అందుకే మాజీ టిడిపి నాయకుడు, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దింపింది. దీంతో టిడిపి కూడా నామా నాగేశ్వరరావును పోటీకి దించాలని భావించినప్పటికీ పోటీ చేసిన ఓడిపోవడం ఖాయం అని తెలియడంతో తన రూటును మార్చుకుంది. టిపిసిసి చీప్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్ది కోరిన వెంటనే వైయస్సార్‌సీ, టిడిపిలు కాంగ్రెస్‌ అభ్యర్ది, స్వర్గీయ రాంరెడ్డి వెంకటరెడ్డి భార్య సుచరితా రెడ్డిని బలపరచాలని నిర్ణయించుకున్నాయి. కానీ వామపక్షాలు మాత్రం పోటీకి సిద్దం అంటున్నాయి. వామపక్షాలు పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వారి ప్రభావం పెద్దగా ఉండదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో అధికార టిఆర్‌ఎస్‌ అభ్యర్థి తుమ్మల, సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భార్య సుచరితారెడ్డిల మద్యనే పోరు కొనసాగనుంది. మొత్తానికి ఓడిపోయే దానికి నిలబడడం ఎందుకు? అనే ఆలోచనలో ఉన్న టిడిపి, వైయస్సార్‌సీపీలకు కాంగ్రెస్‌ అనుకోని వరం ఇచ్చిందనే భావించాలి. 

tdp
great escape
nama nageswara rao
ram reddy venkata reddy
tummala nageswara rao
trs
congress
ysrcp