శర్వానంద్‌ సుడి తిరగనుందా!

వరుసగా 'రన్‌రాజా రన్‌, మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు' చిత్రాలతో రెండు హిట్స్‌ ఇచ్చి హ్యాట్రిక్‌ కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్‌హీరో శర్వానంద్‌. ఇక 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'తో సంచలనం సృష్టించిన దర్శకుడు మేర్లపాక గాంధీ ఎంతో గ్యాప్‌ తీసుకొని తన రెండో చిత్రంగా 'ఎక్స్‌ప్రెస్‌రాజా' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సురభి హీరోయిన్‌గా నటిస్తోంది. 'మిర్చి, రన్‌ రాజా రన్‌, జిల్‌, భలే భలే మగాడివోయ్‌' వంటి క్లీన్‌ ఎంటర్‌టైనర్స్‌ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థగా మారిన యూవీ క్రియేషన్స్‌ బేనర్‌లో వంశీ, ప్రమోద్‌లు ఈ 'ఎక్స్‌ప్రెస్‌రాజా'ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. చిత్రాన్ని చూసిన సెన్సార్‌ సభ్యులు ఈ చిత్రంలో వచ్చే థ్రిల్స్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఈ చిత్రాన్ని చూడటం విశేషం. పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రంగా సెన్సార్‌ సభ్యులు ఈ చిత్రానికి కితాబు ఇచ్చారు. అలాగే సినిమాకు క్లీన్‌యు సర్టిఫికేట్‌ ఇచ్చారు. ఇక దిల్‌రాజు ఓ చిత్రం రైట్స్‌ తీసుకున్నాడంటే ఆ సినిమాకు ఎక్కడలేని క్రేజ్‌ వచ్చేస్తుంది. తాజాగా ఆయన ఈ 'ఎక్స్‌ప్రెస్‌రాజా' చిత్రం నైజాం రైట్స్‌ తీసుకున్నాడు. రీసెంట్‌గా ఆయన ఈ చిత్రం స్పెషల్‌ స్క్రీనింగ్‌ చూసి వెంటనే రైట్స్‌ తీసుకున్నాడని సమాచారం. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందనే కాన్ఫిడెన్స్‌ అందరిలో కలుగుతోంది. మరి ఈ సినిమా సూపర్‌హిట్‌ అయితే హీరో శర్వానంద్‌కు ఇక తిరుగుండదని ఆయన సన్నిహితులు ఆశిస్తున్నారు. 

sharwanand
express raja
surabhi
dil raju
censor of express raja