1700 కోట్ల ప్రైమ్ ల్యాండ్పై టాలీవుడ్ స్టార్ల కన్ను
Tollywood Stars Eye RS 1,700 Crore Prime Land
విశాఖపట్నం నగరంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ AAA సినిమాస్ (ఇనార్బిట్ మాల్) పరిసరాల్లోని సీతమ్మధారను ఆనుకుని ఉన్న హెచ్బీ కాలనీ, ఆటోనగర్లలో సుమారు 19.29 ఎకరాల స్టీల్ ప్లాంట్ భూములను నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (NLMC) ఈ-వేలానికి సిద్ధం చేసింది. హెచ్బీ కాలనీలోని 456 ప్లాట్లు (18.17 ఎకరాలు), ఆటోనగర్లోని 3 ప్లాట్ల ద్వారా ప్రాథమికంగా రూ. 900 కోట్లు రాబట్టాలని భావించినా నేషనల్ హైవే -16కి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో గజం ధర రూ. 1.5 లక్షల నుండి రూ. 2 లక్షల వరకు పలుకుతుండటంతో వేలం విలువ రూ. 1,700 కోట్ల వరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వేలంలో చిన్న బిట్లుగా కూడా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుండటం వ్యాపార వర్గాల్లో ఆసక్తిని పెంచింది.
టాలీవుడ్ స్టార్స్ మోజు: భోగాపురం ఎయిర్పోర్ట్ ఎఫెక్ట్తో పెరిగిన డిమాండ్!
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకతో వైజాగ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పుడు టాలీవుడ్కి చెందిన పాన్ ఇండియా హీరోలు, సీనియర్ స్టార్లు తమ పెట్టుబడులను ఇక్కడ పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం రూ. 50 కోట్ల నుండి రూ. 100 కోట్లకు పైగా పారితోషికాలు.. లాభాల్లో వాటాలు అందుకుంటున్న సినీ తారలు, బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఈ ప్రైమ్ ల్యాండ్ను దక్కించుకునేందుకు పోటీపడుతున్నట్లు సమాచారం. ఎలాంటి భూగర్భ నీటి సమస్యలు లేని అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న ఈ స్థలాలు కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉండటంతో ఇ- వేలంలో కోట్లాది రూపాయల పెట్టుబడులు తరలి వస్తాయని అంచనా వేస్తున్నారు.







































