గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఒక స్థల వివాదంలో హై కోర్టుని ఆశ్రయించడం హాట్ టాపిక్ అయ్యింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం 75లో ఉన్న ఓ స్థలానికి సంబంధించిన వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్ దాఖలు చేశాడు. 2003లో గీతాలక్ష్మి నుంచి ఎన్టీఆర్ ప్లాట్ కొనుగోలు చేశాడు. ఎన్టీఆర్ స్థలం కొనకముందే అంటే 1996 లోనే పలు బ్యాంకుల దగ్గర ఇదే స్థలంపై గీతాలక్ష్మి ప్రాపర్టీ మార్టిగేజ్ ద్వారా అప్పు తీసుకుంది.
అదే స్థలం మీద గీత లక్ష్మి మూడు, నాలుగు బ్యాంకుల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్లు తీసుకునట్లుగా తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్కు స్థలం అమ్మే సమయంలో ఈ విషయాన్ని గీతాలక్ష్మి దాచిపెట్టి ఆ స్థలాన్ని విక్రయించారు. దాదాపు ఐదు బ్యాంకుల నుంచి ఇదే డాక్యుమెంట్ మీద గీతాలక్ష్మి రుణాలు తీసుకున్నారు.
కానీ తనకి ఒక్క బ్యాంకులో మాత్రమే మార్టిగేజ్ లోన్ ఉన్నట్లు అప్పట్లో ఎన్టీఆర్కు గీతాలక్ష్మి చెప్పారు. ఎన్టీఆర్ కూడా చెన్నైలో ఒక బ్యాంక్లో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకుని 2003 నుంచి ఎన్టీఆర్ ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఎన్టీఆర్ స్థలం కొన్నప్పటినుంచి మిగతా బ్యాంకు ల వారు ఆ స్థలాన్ని జప్తు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఈ క్రమంలో బ్యాంకు మేనేజర్లపై ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా.. 2019లో ఈ వ్యవహారంపై పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. తాజాగా DRTలో ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దానితో ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. జూన్ 3లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయాలని కోర్టు కోరింది. ఈ పిటిషన్పై హైకోర్టు జూన్ 6న విచారణ చేపడతామన్నారు.