ప్రముఖ బాలీవుడ్ నటి జియా ఖాన్, నిర్మాత ఆదిత్య పాంచోళి కొడుకు, నటుడు సూరజ్ పాంచోళి మధ్య ప్రేమాయణం, సహజీవనం, అటుపై జియా ఆత్మహత్య వ్యవహారం కొన్నేళ్ల క్రితం సంచలనమైన సంగతి తెలిసిందే. జియా ఉరి వేసుకుని తన అపార్ట్ మెంట్ లో కనిపించింది. అయితే ఇది ఆత్మ హత్య కాదని, ఈ ఆత్మహత్యకు ప్రేరేపించింది ప్రియుడు సూరజ్ పాంచోళి అంటూ తీవ్రంగా ఆరోపిస్తూ జియా తల్లి కోర్టు మెట్లెక్కారు.
ఈ కోర్టు కేసు కొన్నేళ్ల పాటు కొనసాగింది. చివరకు 2023లో తుది తీర్పు వెలువడింది. చివరికి సూరజ్ పాంచోళి నిర్ధోషిగా బయటికి వచ్చాడు. సాక్ష్యాధారాలు లేనందున అతడిని నిర్ధోషిగా విడుదల చేస్తున్నామని న్యాయమూర్తి ప్రకటించారు. ప్రస్తుతం సూరజ్ జైలు శిక్ష నుంచి బయటపడి, తిరిగి నటనలో కొనసాగుతున్నాడు. అతడు రీఎంట్రీ లో నటించిన సినిమా రిలీజ్ కోసం ప్రచారంలో ఉన్నాడు. ఈ సమయంలో అతడు తన జైలు జీవితం గురించి గుర్తు చేసుకున్నాడు.
తనను కసబ్ ని ఉంచిన సెల్ లో వేసారని, జైలు అధికారులు క్రూరంగా చూసారని తెలిపాడు. తనను బాంబ్ బ్లాస్ట్ చేసిన వాడిని చూసినట్టు చూసారని అతడు అన్నాడు. తీవ్రమైన నేరం చేసినట్టు అందరూ చూసారని, చివరికి నిర్ధోషిగా బయటికి వచ్చాక ఇండస్ట్రీ వ్యక్తులు, తెలిసిన వారు కాల్ చేసి తప్పుగా అర్థం చేసుకున్నామని చెప్పినట్టు వెల్లడించాడు సూరజ్. 21 ఏళ్ల వయసులో తనకు దానిని అర్థం చేసుకునే స్థితి లేదని, అంతా కలలా ముగిసిందని పాంచోళి తెలిపాడు.