RRR కోసం పవన్ త్యాగం!

రఘురామకు ఇక పవనే దిక్కు!
అవును.. మీరు వింటున్నది నిజమే.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రమే దిక్కు. ఎలాగంటారా..? కూటమి కోసం ఆయన ఎంత కష్టపడ్డారో.. జగన్ ప్రభుత్వాన్ని ఏ రేంజ్లో బద్నాం చేస్తూ మాట్లాడారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టీడీపీ-జనసేన-బీజేపీ ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో పెద్దల సమక్షంలోనే తాను నరసాపురం నుంచి పోటీచేస్తానని.. అది కూడా ఎంపీగానని తనకు తానుగా ప్రకటించేసుకున్నారు కూడా. సీన్ కట్ చేస్తే.. ఈ పార్లమెంట్ స్థానం బీజేపీ ఖాతాలోకి వెళ్లడం.. వర్మ అనే కట్టర్ కాషాయ పార్టీ నేతకు ఇవ్వడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అంతేకాదు.. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను బీజేపీ, టీడీపీలు ప్రకటించేశాయి కూడా. తెలుగుదేశం తుది జాబితాలో కచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరుంటుందని అందరూ భావించారు కానీ.. ఆఖరికి ఆయనకు నిరాశే మిగిలింది. ఇక మిగిలింది జనసేన అభ్యర్థుల ప్రకటన మాత్రమే. దీంతో పవన్ ఒక్కరే తనకు దిక్కు అన్నట్లుగా రఘురామ పరిస్థితి ఉందని.. సేనాని అయినా ఆదరించకపోతారా అని వేయి కళ్లతో రఘురామ వేచి చూస్తున్నారట.
అయ్యే పనేనా..!
జనసేన ప్రకటించాల్సిన వాటిలో ఇక మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. పాలకొండ, అవనిగడ్డ, విశాఖ సౌత్ మాత్రమే. ఇందులో ఏ ఒక్కటీ రఘురామకు సంబంధంలేని నియోజకవర్గాలు కానే కాదు. కానీ.. అమరావతి రైతులకు సపోర్టుగా నిలబడటం, వారికోసం హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు సైతం వేసిన వ్యక్తి రఘురామ. అంతేకాదు.. ఆర్ఆర్ఆర్ అమరావతి ఉద్యమంలో కూడా పాల్గొని.. రైతుల పక్షాన నిలబడిన వ్యక్తి. రాజధాని లేని రాష్ట్రాన్ని ఏలుతున్నారని వైఎస్ జగన్కు ఏకిపారేసిన వ్యక్తి కూడా. అమరావతి చుట్టుపక్కల నియోజకవర్గాల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకతే ఉంది. అందుకే ఇక్కడ్నుంచి జనసేన తరఫున నిలబెడితే మాత్రం కచ్చితంగా కలిసొచ్చే ఛాన్స్ ఉందని ఇన్సైడ్ టాక్. మరోవైపు.. కాపు కీలక నేత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణను పార్టీలోకి చేర్చుకుని ఇక్కడ్నుంచి పోటీ చేయించాలని పవన్ భావిస్తున్నారని టాక్. ఇప్పుడు రఘురామను పార్టీలోకి చేర్చుకుని.. సీటిస్తారా లేకుంటే రాధాకే ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.
పోటీ తప్పనిసరి..!
రఘురామను వదులుకోవడం కూటమికి ఇష్టం లేదు కానీ.. సీటు దగ్గరికి వచ్చేసరికి మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. అయితే విశ్వసనీయ వర్గాలసమాచారం ఆర్ఆర్ఆర్ను ఎన్నికల బరిలోకి దింపాల్సిందేనని కూటమిలో పెద్ద చర్చే జరుగుతోంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి ముగ్గురూ కలిసి కూర్చొని త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో రఘురామ ఎన్నికల బరిలో ఉండటం మాత్రం పక్కా అని కూటమి నేతలు చెబుతున్నారు. అతి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోవైపు.. తనకు ఏ కూటమీ అక్కర్లేదని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు. అంతేకాదు.. సిట్టింగ్ ఎంపీగా నరసాపురం నుంచి పోటీ చేయడానికి ఆ హక్కు ఉందని ఇప్పటికే తేల్చి చెప్పేశారు. ఫైనల్ కూటమి ఏమైనా సీట్ల విషయంలో మార్పులు, చేర్పులు చేసి ఆయనకు సీటిస్తుందా లేకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారో మరికొన్ని రోజులు తేలిపోనుంది మరి.
RaghuramaRaju is now in the direction of Pawan!
Pawan Kalyan sacrifice for RRR!






































