దేశచరిత్రలోనే తెలుగు వంటి ప్రాంతీయ భాషలో రూపొందిన దేశవ్యాప్తంగా, విదేశాలలో ఏకంగా 2600కోట్లకు పైగా కొల్లగొట్టిన చిత్రం ‘బాహుబలి’ సిరీస్. ఈ చిత్రం విడుదలైన తర్వాతనే అమీర్ఖాన్ తన ‘దంగల్’ చిత్రాన్ని చైనాలో కూడా రిలీజ్ చేసి ‘బాహుబలి’ని కొద్ది పాటి తేడాతో దాటాడు. అయితే ‘దంగల్’, ‘బాహుబలి’ సిరీస్ విషయాలను పక్కనపెడితే ‘బాహుబలి’ రేంజ్ చిత్రం అని ప్రతిభాషలో విడుదలైన చిత్రం కూడా ఘోరపరాజయం పాలైంది. కేవలం బాలీవుడ్లో సంజయ్లీలాభన్సానీ తీసిన రాజ్పుత్ రాణి ‘పద్మావత్’ చిత్రం మాత్రమే ఫర్వాలేదనిపించింది. ఇక తమిళంలో ‘పులి, సంఘమిత్ర, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చివరకు ‘2.ఓ’ కూడా బాహుబలిని మించి లేకపోతే ‘సంఘమిత్ర’ వంటివి అసలు పట్టాలే ఎక్కలేదు. అయినా తెలుగు ‘బాహుబలి’ సిరీస్ని బద్దలు కొట్టాలన్న కోరిక మిగతా భాషల వారిని నిలువనీయడం లేదు.
‘బాహుబలి’ని బాలీవుడ్లో రిలీజ్ చేసి కాసుల వర్షంగా లాభాలు అందుకున్న ధర్మప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఇప్పుడు మరోసారి ‘బాహుబలి’ని టార్గెట్ చేస్తూ మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఆల్రెడీ టైటిల్గా ‘తఖ్త్’ని కూడా రిలీజ్ చేశాడు. హిస్టారికల్ బ్యాగ్రౌండ్తో, యుద్దాలు, కుర్చీ కోసం అన్నదమ్ముల కొట్లాటలు, యుద్దవిన్యాసాలు, గుర్రపుస్వారీలు, కత్తి యుద్దాలతో పాటు ఎమోషన్స్ నిండిన మొఘల్ సామ్రాజ్య చరిత్రలోని కీలకఘట్టం ఆధారంగా దీనికి ముహూర్తం నిర్ణయించాడు. ‘తఖ్త్’ అంటే సింహాసనం, ఆ సింహాసనం కోసం పడే పాట్లుతో ఈ మూవీ రూపొందనుంది. ఇందులో రణవీర్సింగ్ ధారోశిఖో అనే యోధునిగా, మొఘల్ సామ్రాజ్యపు చివరి చక్రవర్తి అయిన ఔరంగజేబు పాత్రలో నవతరం నటుడు విక్కీకౌశల్ నటించనుండగా, ఇతర పాత్రల్లో కరీనాకపూర్, అలియాభట్, జాన్వికపూర్, భూమి పెడ్నేకర్ వంటి భారీ తారాగణం నటిస్తుండటం విశేషం.
ఈ మూవీకి కరణ్ జోహారే దర్శకత్వం వహించడమే కాదు.. ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కొత్త ఏడాదిలో ప్రేక్షకులకు కరణ్ తెలుపనున్నాడు. మరి ఈ చిత్రమైనా నిజంగా ‘బాహుబలి’ని మించుతుందా? లేదా? ‘బాహుబలి’ రేంజ్ చిత్రం అంటూ వచ్చిన చిత్రాలు సాధించిన ఘోరపరాజయం సెంటిమెంట్ని కొనసాగిస్తుందా? అనేది వేచిచూడాల్సివుంది...!