నితిన్‌ పోయినదంతా రాబట్టుకుంటాడా..?

CineJosh news

అక్కినేని అఖిల్‌ నటించిన తొలి చిత్రాన్ని ఆయన స్నేహితుడు, హీరో అయిన నితిన్‌ నిర్మించాడు. ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డి నైజాంలో పేరు గడించిన డిస్ట్రిబ్యూటర్‌ కావడం, నిర్మాత కూడా కావడంతో నితిన్‌ ఆ అనుభవంతో అంత రిస్క్‌ చేశాడు. కానీ ఈ చిత్రం నితిన్‌కు, ఆయన తండ్రికి తీవ్రనష్టాలను మిగిల్చింది. ఇక నితిన్‌ తన తండ్రి చేత తాజాగా బాలయ్య నటించిన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' నైజాం ఏరియాకు రైట్స్‌ కొనుగోలు చేయించాడు. రేట్లు రీజనబుల్‌గా ఉండటం, సినిమా బాగా ఆడటం, ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం కూడా వినోదపు పన్ను మినహాయించడంతో ఇది నితిన్‌కి బాగానే వర్కౌట్‌ అయింది. ఇక నితిన్‌ తాజాగా తనకు దైవ సమానుడైన పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కాటమరాయుడు' నైజాం రైట్స్‌ను కూడా సొంతం చేసుకొని ప్రస్తుతం వార్తల్లో వ్యక్తి అయ్యాడు. 

'వీరం' ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా మరోసారి 'గబ్బర్‌సింగ్‌' జోడీ శృతిహాసన్‌ నటిస్తోంది. ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహిస్తుండగా, అనూప్‌రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌ సంచలనాలను సృష్టిస్తూ చిత్రంపై భారీ అంచనాలను రేకెత్తించడంలో సఫలమైంది. ఇక త్వరలో షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకొని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు వెళ్లనుంది. ఆ తర్వాత ఆడియో, ఇక మార్చి 29న ఉగాది సందర్భంగా సినిమాలు విడుదలకానున్నాయి. 

ఈ చిత్రం రైట్స్‌ను నితిన్‌ ఒక్కడే కొనకుండా ఏషియన్‌ఫిల్మ్స్‌తో భాగస్వామ్యంగా కొనుగోలు చేశాడు. ఈ హక్కులను ఆయన 20కోట్లకు తీసుకున్నాడని సమాచారం. ఇందులో రెండు కోట్లు రికవబుల్‌ అమౌంట్‌. అంటే 18కోట్లు రిస్క్‌ను నితిన్‌, ఏషియన్‌ ఫిల్మ్స్‌లు తీసుకొన్నాయి. ఈ చిత్రం రైట్స్‌ను తనకు పవన్‌తో, నిర్మాత శరత్‌మరార్‌తో ఉన్న పరిచయం వల్ల నితిన్‌ ఇప్పించడంతో నితిన్‌ 8కోట్లు, ఏసియన్‌ ఫిల్మ్స్‌ 10కోట్లు పెట్టుబడిగా పెట్టాయి. గతంలో పవన్‌ నటించిన 'గబ్బర్‌సింగ్‌, అత్తారింటికి దారేది' చిత్రాలు నైజాంలో 30కోట్లకు పైగా షేర్‌ వసూలు చేశాయి. దీంతో ఈ అమౌంట్‌ పెద్ద రిస్కేమీ కాదంటున్నారు. మరీ 'సర్దార్‌'లా డిజాస్టర్‌ అయితే ఓ మూడు నాలుగు కోట్లు నష్టం వస్తుంది. మొత్తానికి ఈ విషయంలో నితిన్‌ ఎంతో ముందుచూపుతో వ్యవహరించాడని అర్ధమవుతోంది. 

nithiin
akhil
pawan kalyan
katamarayudu movie
asian films and nithiin
shruti haasan