ప్రభుత్వానికి మాలీవుడ్ వార్నింగ్

కేంద్రం జీఎస్టీతో వినోదంపై పెను భారం మోపింది.. ఇప్పుడు దానికి వినోదపన్ను పేరుతో రాష్ట్రప్రభుత్వాలు వసూలు చేస్తున్నది మరింత అదనపు భారంగా మారింది. అయితే దేశంలోని ఏ సినీపరిశ్రమ కూడా ఇలాంటి వాటిని నిలదీయలేదు. కానీ మలయాళ చిత్రపరిశ్రమ వినోదపన్నును రద్దు చేయాలంటూ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. పెరిగిన ఖర్చులను అర్థం చేసుకుని వినోదపు పన్నును తొలగించాలని, సినీపరిశ్రమను ప్రోత్సహించాలని పరిశ్రమ పెద్దలు కోరుతున్నారు.
ఈనెల 22న థియేటర్లను మూసివేసి, షూటింగులు కూడా ఆపేయాలని మాలీవుడ్ మెరుపు సమ్మెను ప్రకటించింది. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ఇది శాంపిల్ మాత్రమే.. ఇకపై నిరవధిక సమ్మెలకు కొదవేమీ ఉండదని ప్రభుత్వాన్ని మాలీవుడ్ హెచ్చరించింది. ఆ మేరకు కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇతర సినీ అనుబంధ సంఘాలు నిర్ణయంతో అంతటా గందరగోళం నెలకొంది.
థియేటర్లకు విద్యుత్ టారిఫ్ లు తగ్గించాలని కూడా మాలీవుడ్ థియేటర్ల యాజమాన్య సంఘం డిమాండ్ చేస్తోంది. సింగిల్ విండో విధానంలో షూటింగులకు అనుమతులు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. థియేటర్ల బంద్ తో పాటు షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు బంద్ అవుతాయని ఛాంబర్ ప్రకటించింది. గత ఏడాది 180పైగా సినిమాలు విడుదలైతే కేవలం 15 సినిమాలు మాత్రమే సక్సెసయ్యాయి. దాదాపు 600 కోట్ల నష్టం వాటిల్లిదని కూడా మాలీవుడ్ ఫిలింఛాంబర్ గణాంకాలను వెల్లడిస్తోంది. అయితే జనవరి 14న సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Malayalam cinema organisations announce token strike
Mollywood film industry Warning To Government








































