చంపేవాడు ఒకడుంటే చచ్చేవాడు ఇంకొకడు ఉండాలి! ఇది కలియుగ నీతి. పంజాబీ పాప్ కల్చర్ లో చంపేవాడు గాయకుడు, చచ్చేవాడు గాయకుడే. ఎందుకంటే అక్కడ మాఫియాతో లింక్ లేనిదే గాయకులు లేరు. చాలా మంది మాఫియాలో భాగం. అక్కడ పాప్ కల్చర్ ని మించి గన్ కల్చర్ పాపులరైంది. గాయకుల మధ్య కూడా చాలా వివాదాలు ఉన్నాయి.
2022లో తన స్వస్థలంలో పట్టపగలు తుపాకులతో కాల్చి చంపారు గాయకుడు సిద్ధూ మూసేవాలాను. అతడి హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటన దాదాపు మూడు సంవత్సరాల క్రితం జరిగింది. కానీ కుటుంబంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఇప్పటికీ సిద్ధూ ఎందుకు హత్యకు గురయ్యాడో అర్థం కాలేదని అంటున్నారు.
లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ముఠా ఈ నేరానికి బాధ్యత వహించారు. కానీ ఇది ఎందుకు జరిగిందనేది BBC కొత్త డాక్యుమెంటరీ సిరీస్- `ది కిల్లింగ్ కాల్`లో వెల్లడించారు. డాక్యుమెంటరీ రెండవ ఎపిసోడ్, సిద్ధు కెనడాలో నివసించినప్పటి నుండి అతడి కెరీర్ ప్రారంభ రోజులలో లారెన్స్ బిష్ణోయ్తో సంబంధాలను కలిగి ఉన్నాడని పేర్కొంది. అతడు భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు గ్యాంగ్స్టర్ బిష్ణోయ్, అతడి ప్రత్యర్థులతో సిద్ధూ మూసేవాలా సంబంధం మరింత పెరిగింది. ఇది ఏదో ఒకవిధంగా అతడి హత్యకు కారణమైంది. నిందితులలో ఒకరైన, ఇప్పటికీ పరారీలో ఉన్న గోల్డీ బ్రార్ కూడా ఈ డాక్యుమెంటరీలో ఈ సంఘటన గురించి ఆడియో రికార్డింగ్లలో మాట్లాడాడు.
డాక్యు సిరీస్ లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఇష్లీన్ కౌర్ కొన్ని రహస్యాలు వెల్లడించారు. ``సిద్ధు కెనడాలో ఉన్నప్పటి నుంచి లారెన్స్ బిష్ణోయ్తో టచ్లో ఉన్నాడు.. అలాగే అతడు బిష్ణోయ్ ప్రత్యర్థులైన బాంబిహా గ్యాంగ్తో కూడా స్నేహంగా ఉన్నాడు! అని అన్నారు. ఈ ఎపిసోడ్ సిద్ధు- లారెన్స్ మధ్య వివాదం ఎందుకు జరిగిందో ప్రధాన కారణాన్ని కనుగొనడానికి ఆధారాల్ని అందించే ప్రయత్నం చేస్తుంది. బాంబిహా గ్యాంగ్లో భాగమైన మందీప్ ధాలివాల్ అనే గ్యాంగ్స్టర్ కబడ్డీ మ్యాచ్ నిర్వహించి, సిద్ధును ప్రదర్శనకు ఆహ్వానించాడని ఒక అనామక సంగీత సహచరుడు చెప్పాడు. సిద్ధు తన ప్రత్యర్థి గ్యాంగ్తో తిరగాలని లారెన్స్ బిష్ణోయ్ కోరుకోలేదు. అయినా సిద్ధు ప్రత్యర్థులతో అంటకాగాడు.
గోల్డీ బ్రార్ ఆడియో రికార్డింగ్ల ప్రకారం... హత్యకు కారణం అర్థం చేసుకోవచ్చు. మొదటి వివాదం భాగో మజ్రాలో కబడ్డీ ఆట. మా ప్రత్యర్థులు వచ్చిన గ్రామం అది. అతడు మా ప్రత్యర్థులను ప్రోత్సహిస్తున్నాడు. అప్పుడే లారెన్స్ సహా ఇతరులు సిద్ధు వ్యవహారంతో కలత చెందారు. వారు సిద్ధును బెదిరించారు. అతడిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అహంకారంలో సిద్ధు క్షమించలేని కొన్ని తప్పులు చేశాడు! అని అతడు అన్నాడు.
ఆగస్టు 2021లో విక్కీ మిద్దుఖేరా హత్య తీవ్ర పరిణామాలకు దారితీసింది. విక్కీ గ్యాంగ్ స్టర్లు లారెన్స్- గోల్డీ ఇద్దరికీ స్నేహితుడు. వారు అతడిని గురువుగా చూశారు. బాంబిహా గ్యాంగ్ హత్యకు కారణమని ఆరోపించారు. కానీ ఇది సిద్ధూకు సమస్యలను సృష్టించింది. ఎందుకంటే అతడు వారితో స్నేహంగా ఉన్నాడు. తరువాత హత్యకు సంబంధించిన ఛార్జిషీట్ దాఖలు చేసినప్పుడు, సిద్ధూకు సన్నిహితుడు, స్నేహితుడు అయిన షగన్ప్రీత్ సింగ్ పేరు హత్య కుట్రకు సహాయం చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్కు చెందిన హెచ్జిఎస్ ధాలివాల్ డాక్యుమెంటరీలో, షగన్ప్రీత్ కాల్పులు జరిపిన వారికి ఆతిథ్యం ఇచ్చాడు.. వారికి వసతి కల్పించాడు అని అన్నారు. షగన్ప్రీత్ దేశం విడిచి వెళ్ళాడు కానీ విక్కీ హత్యలో సిద్ధూ ప్రమేయం కూడా ఉండవచ్చని పుకార్లు మొదలయ్యాయి. సిద్ధూ పుకార్లను తిరస్కరించినా కానీ, సిద్ధూ ప్రత్యర్థి ముఠాతో స్నేహంగా ఉన్నాడనే భావన ఉంది.
గోల్డీ బ్రార్ ముఖ్యంగా ఒక మాట అన్నాడు. ``విక్కీ మరణంలో సిద్ధూ పాత్ర అందరికీ తెలుసు, పోలీసులకు తెలుసు, జర్నలిస్టులకు కూడా తెలుసు. ఆయన తన రాజకీయ శక్తిని, తన డబ్బును, తన వనరులను మన ప్రత్యర్థులకు, మన సోదరుడిని చంపిన వారికి సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నాడు. ఆయన చేసిన దానికి శిక్ష అనుభవించాలని మేము కోరుకున్నాము. ఆయనపై కేసు నమోదు చేయాలి. ఆయనను జైలులో పెట్టాలి.. కానీ ఎవరూ మా విన్నపం వినలేదు. కాబట్టి మేము దానిని మా చేతుల్లోకి తీసుకున్నాము. మర్యాద చెవిటి చెవిలో పడినప్పుడు, అది తుపాకీ గుండు శబ్దమై వినిపిస్తుంది`` అని అన్నాడు. తన్ని చంపడం తప్ప మాకు వేరే మార్గం లేదు. అతడు చేసిన దానికి పర్యవసానం ఎదుర్కోవలసి వచ్చింది.. అని కూడా వ్యాఖ్యానించాడు. లారెన్స్- గోల్డీ బ్రార్లతో స్నేహంగా ఉంటూనే, వారి ప్రత్యర్థులతో స్నేహం కొనసాగించడం, అటుపై అనుమానాలకు తావివ్వడమే ప్రధానంగా ఈ హత్యకు కారణమైంది.