విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కలయికలో రూపొందుతోన్న చిత్రం కింగ్డమ్. మే 30వ తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు డేట్ మార్చేసింది. మే 30 నుంచి కింగ్డమ్ జూలై 4వ తేదీకి వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మా ప్రియమైన ప్రేక్షకులకు,
మే 30న విడుదల కావాల్సిన మా కింగ్డమ్ సినిమాను జూలై 4న విడుదల చేయనున్నామని తెలియజేస్తున్నాము. ముందుగా అనుకున్నట్టుగా మే 30వ తేదీకే సినిమాని తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాము. కానీ, మన దేశంలో ఇటీవల ఊహించని సంఘటనలు జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్లు, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి, ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ నిర్ణయం కింగ్డమ్ కి మరిన్ని మెరుగులు దిద్ది, సాధ్యమైనంత ఉత్తమంగా మలచడానికి సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాము. కాస్త ఆలస్యంగా వచ్చినా కింగ్డమ్ చిత్రం అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. జూలై 4న థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ చిత్రం, మీ ప్రేమను పొందుతుందని ఆశిస్తున్నాము.
విడుదల తేదీ మార్పు విషయంలో తమ మద్దతు ఇచ్చినందుకు దిల్ రాజు గారికి, నితిన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అని చిత్ర బృందం పేర్కొంది.
విజయ్ దేవరకొండ తన కెరీర్లో అత్యంత శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో ఆయన కనిపించిన తీరు అందరినీ కట్టిపడేసింది. విజయ్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే ఒక ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నారు.