దర్శకుడు పూరి జగన్నాథ్ తన `పూరి మ్యూజింగ్స్` పాడ్ కాస్ట్ ద్వారా సమాజంలోని కఠిన వాస్తవాలను, ముఖ్యంగా సక్సెస్ వచ్చినప్పుడు మనుషుల వైఖరిలో వచ్చే మార్పులను ఎంతో నిశితంగా విశ్లేషించారు. సక్సెస్ అనేది మనిషికి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి కానీ అహంకారాన్ని కాదని, ఒక వ్యక్తికి అహంకారం పెరిగితే విమర్శలను అంగీకరించలేరని పూరి సర్ హెచ్చరించారు.
మన దగ్గర డబ్బు, విజయం ఉన్నంత కాలం లోకం మనల్ని ఎంకరేజ్ చేస్తుంది కానీ.. మన అహంకారం తగ్గాలని లోలోపల కోరుకుంటుందని, అది శృతిమించితే చివరికి ఒంటరితనం మిగులుతుందని పూరి కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో సక్సెస్ శాశ్వతం కాదని.. ఎందరో శిఖరాగ్రం నుండి కిందకు పడిపోయిన చరిత్రను గుర్తు చేస్తూ తోటి వారిని తక్కువ చేసి చూడటం కేవలం అజ్ఞానమే అవుతుందని ఆయన హితవు పలికారు.
ఇక పూరి తెరకెక్కిస్తున్న సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో కలిసి `స్లమ్డాగ్ - 33 టెంపుల్ రోడ్` అనే గ్రిట్టీ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. విజయ్ సేతుపతి పుట్టినరోజున విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, అతడి రగ్గడ్ లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై, హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది.