మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి!
వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు
వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్లో జరిగిన హిందూ మహా సమ్మేళన్ కార్యక్రమంలో ఇరవై ఒక్క హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పారాయణల అఖండ కార్యక్రమం పరమ వైభవంగా జరగటంతో టాక్ ఆఫ్ ది ట్విన్ సిటీస్గా నిలవడం అనేక ఆలయాల్లో, భక్తమండళ్లలో ఆశ్చర్యకరమైన పవిత్ర చర్చగా దారితీసి మరొక మహోజ్జ్వల ఘట్టానికి దారితీసేందుకు శ్రీకారం చుడుతోంది.
నగర ప్రముఖులు, హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సమన్వయకర్తలు చంద్రశేఖర్ గాంధీ, శ్రీమతి జగన్మోహిని, జమలాపురం రాధాకృష్ణల చక్కని సంఘీభావ నిర్మాణాత్మక దక్షతతో ఈ మహాకార్యం దిగ్విజయంగా జరగడంతో భక్తకోటి రసజ్ఞులూ ఒక్కటై వారిపై ప్రశంసలు వర్షన్డం ఆసక్తిదాయకం.
సభాప్రారంభకులు సీనియర్ పాత్రికేయులు, జాతీయవాది రాకా సుధాకర్ రావు తన ప్రసంగంలో... చరిత్రపొడవునా హిందూ సంస్కృతి వైభవ ప్రాభవాలను వివరిస్తూ, వర్తమాన పరిస్థితులలో హిందూధర్మ పరిరక్షణకు యువత నడుం బిగించాలని అనేక ఆసక్తిదాయమైన అంశాలతో పాటు హనుమాన్ చాలీసా విశేషాలతో సభికుల్ని ఆకట్టుకున్నారు. ప్రత్యేక ఆహ్వానితురాలు అహం టాక్స్ అధినేత్రి శ్రీమతి మోనికారెడ్డి మాట్లాడుతూ.. జాతి యావత్తూ హిందూధర్మాన్ని కాపాడుకుంటూ, హిందూ ఐక్యతకు నడుం బిగించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.
ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) కేవలం ఐదు నిమిషాలు మాట్లాడినా అత్యంత ఆసక్తిదాయకంగా, మనోజ్ఞంగా హనుమద్వైభవాన్ని పేర్కొనడం రసజ్ఞుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇంతటి మహా పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం తనకి రావడం పట్ల హనుమంతునికి, నిర్వాహకులకు పురాణపండ ఎంతో వినయంగా కృతజ్ఞతలు తెలిపారు. జీవితాన్ని హనుమ సాధనతో తన్మయింప చేసుకుని అత్యంత ధైర్యంతో ఈతరం మున్ముందుకు కదం తొక్కుతూ సాగాలని పురాణపండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
మైహోం అవతార్ (Myhome Avathar, Hyderabad) గ్రౌండ్స్లో శ్రీమతి జగన్మోహిని పర్యవేక్షణలో సుమారు రెండున్నర గంటల పాటు తులసీదాస్ విరచిత హనుమాన్ చాలీసా పారాయణ ఎంతో భక్తి నిండిన వాతావరణంలో ఇరవై ఒక్క సార్లు సామూహిక పారాయణ కార్యక్రమం జరగడం.. ఆ ప్రాంతంలో పవిత్ర సంచలనం సృష్టించింది. ప్రసన్న గంభీర స్థితిలో జరిగిన ఈ పారాయణ కార్యక్రమంలో సుమారు నాల్గువేలమంది పాల్గొనడం విశేషంగా చెప్పక తప్పదు. ఆద్యంతం శ్రీ రామానుగ్రహంగా, హనుమన్మయంగా జరిగిన హిందూ మహా సమ్మేళన్ (Hindu Maha Sammelan) కార్యక్రమంలో పురాణపండ శ్రీనివాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పలువురు యువతీ యువకులు సెల్ఫీలు దిగడం మీడియా కంట పడటం మరొక ప్రత్యేక విశేషంగానే పేర్కొనాలి. పురాణపండ శ్రీనివాస్ నిస్వార్ధ సేవ గురించీ, అద్భుత ఆధ్యాత్మిక రచనల గురించీ పలువురు ప్రస్తావించడం గమనార్హం. మైహోమ్ అవతార్ చరిత్రలో మైలురాయిలా నిలిచేలా ఇంతటి మహోత్తమ కార్యాన్ని అద్భుతంగా నిర్వహించడంలో ఎంతో కష్టపడిన దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్ గాంధీ, శ్రీమతి జగన్మోహిని, జమలాపురం రాధాకృష్ణలను అనేకమంది అభినందించడం స్పష్టంగా కనిపించింది. భాగ్యనగరంలో ఇటీవల జరిగిన హిందూ మహా సమ్మేళన్ భక్తికార్యక్రమాల్లో ఈ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఒక పతాక స్థాయి విజయమేనని చెప్పాల్సిందే!