తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ సినీ నిర్మాత, నటుడు , రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు (71) కన్నుమూసారు. గుండెపోటుతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా కాజా గ్రామంలో జన్మించిన చిట్టిబాబు అసలు పేరు వరప్రసాద్. ప్రముఖ నిర్మాత త్రిపురనేని మహారథి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన చిట్టిబాబు, తొలినాళ్లలో ఆత్రేయ, అప్పలాచార్య వంటి దిగ్గజాల వద్ద రచనా విభాగంలో పనిచేసి నైపుణ్యాన్ని చాటుకున్నారు.
చిట్టిబాబు సినీ ప్రస్థానం ఎంతో వైవిధ్యభరితమైనది. `సంతానం` సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన, మొత్తం 12 చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా 49 సినిమాలకు కో-డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. కేవలం తెర వెనుకే కాకుండా తెరపై కూడా సుమారు 30కి పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరించారు. నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మించి టాలీవుడ్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు.
దివంగత మహానటి సౌందర్యను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది చిట్టిబాబే. గొప్ప నటులను గుర్తించడంలో ఆయనకు ఉన్న దూరదృష్టికి ఇదొక నిదర్శనం. ఆయన మరణవార్త తెలియగానే టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేసారు. ఆయనతో ఉన్న అను బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు సినిమా అనుభవజ్ఞుడైన సాంకేతిక నిపుణుడిని, నటుడిని కోల్పోయిందని సినీ లోకం ఆవేదన చెందుతోంది.