ప్రస్తుత కాలంలో వెండితెర మనుగడ అసాధారణమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు వినోదానికి ఏకైక చిరునామాగా ఉన్న థియేటర్లకు, నేడు ఓటీటీ ప్లాట్ఫామ్ల రూపంలో బలమైన పోటీ ఎదురవుతోంది. సినిమా విడుదలైన నాలుగు వారాలకే, కొన్నిసార్లు అంతకంటే ముందే డిజిటల్ తెరపై ప్రత్యక్షమవ్వడం వల్ల `కొన్ని రోజులు ఆగితే ఇంట్లోనే చూడొచ్చు కదా` అనే ధోరణి ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోతోంది. దీంతో ముఖ్యంగా చిన్న మరియు మధ్యతరహా చిత్రాలు థియేటర్ల వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోతున్నాయి. ఓటీటీ విండో పీరియడ్ తగ్గడం వల్ల సినిమాలకు ఉండాల్సిన లాంగ్ రన్ కరువై మొదటి వారాంతానికే పరిమితం కావాల్సి వస్తోంది.
అయితే ఓటీటీ కంటే ప్రమాదకరమైన అంశం ఏంటం? అమాంతం పెరిగిన టికెట్ ధరలు , మల్టీప్లెక్స్లలోని ఇతర ఖర్చులు. సామాన్య ప్రేక్షకుడు కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది వినోదాన్ని విలాసంగా మారుస్తోంది. ప్రేక్షకుడు థియేటర్ అనుభవాన్ని ఇష్టపడుతున్నా? అది తన ఆర్థిక పరిధిని దాటినప్పుడు సహజంగానే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నాడు. అంటే ధరల భారం వల్లే ప్రేక్షకులు థియేటర్లకు దూరమై ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారనేది కాదనలేని వాస్తవం. కేవలం భారీ బడ్జెట్ చిత్రాలకు మాత్రమే థియేటర్ కు వెళ్తూ మిగిలిన చిత్రాలను ఇంటి వద్దే చూసుకోవడమే ఉత్తమమని సగడు ప్రేక్షకుడు భావిస్తున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్ల ఉనికిని కాపాడుకోవాలంటే చిత్ర పరిశ్రమ సమతుల్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టికెట్ ధరలను సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఓటీటీ విడుదలకు కనీసం 8 వారాల గ్యాప్ ఉండేలా కఠిన నిబంధనలు పాటించాలి. వినోదం అనేది అందరికీ అందుబాటులో ఉన్నప్పుడే కళాకారులకు, థియేటర్ యాజమాన్యాలకు లాభదాయకంగా ఉంటుంది. వినోదాన్ని మళ్ళీ సామాన్యుడికి చేరువ చేసినప్పుడే వెండితెర కళకళలాడుతుంది.