బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనే - రణ్వీర్ సింగ్ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందించారు. తాము రెండోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఈ జంట ఆదివారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్లో మొదటి సంతానంగా కుమార్తె `దువా`కు జన్మనిచ్చిన ఈ దంపతులు.. ఏడాది తిరగకముందే రెండో బిడ్డను ఆహ్వానించేందుకు సిద్ధమవ్వడం విశేషం. ఈ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
ఈ శుభవార్తను ప్రకటించడానికి దీపికా ఎంచుకున్న విధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీపికా-రణ్వీర్ ల గారాల పట్టి దువా చేతిలో పాజిటివ్ రిజల్ట్ ఉన్న ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకుని ఉన్న క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పోస్ట్కు ఎవరి దృష్టి తగలకూడదన్నట్లుగా `ఈవిల్ ఐ` (దిష్టి చుక్క) ఎమోజీని క్యాప్షన్గా జోడించారు. ఈ సరికొత్త అనౌన్స్మెంట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
దీపికా గర్భధారణకు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ టాలీవుడ్లో నడుస్తోంది. మొదటి బిడ్డ సమయంలో ఆమె ప్రభాస్ సరసన `కల్కి 2898 ఏడి` షూటింగ్లో పాల్గొనగా, ఇప్పుడు రెండో బిడ్డ సమయంలో అల్లు అర్జున్ సినిమా సెట్స్లో ఉండటం యాదృచ్ఛికంగా మారింది. ప్రస్తుతం దీపికా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక భారీ సైన్స్ ఫిక్షన్ - ఫాంటసీ చిత్రంలో నటిస్తోంది.
రణ్వీర్ సింగ్- దీపికా పదుకొనే 2018లో ఇటలీలోని లేక్ కోమో వేదికగా అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి ఈ జంట అటు కెరీర్ పరంగా, ఇటు వ్యక్తిగత జీవితం పరంగా ఎంతో బ్యాలెన్స్డ్గా ముందుకు సాగుతున్నారు. రణ్వీర్ ప్రస్తుతం `దురంధర్` ఫ్రాంచైజీ విజయంతో జోరు మీదుండగా భవిష్యత్తులో మరిన్ని భారీ బడ్జెట్ చిత్రాలకు సంతకం చేసే పనిలో ఉన్నాడు. దీపికా కూడా అగ్ర హీరోల సినిమాలతో బిజీగా ఉన్నా.. కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
ఈ జంట తమ జీవితంలోకి రాబోయే కొత్త అతిథి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే `దువా` రాకతో వీరి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనగా.. రెండో బిడ్డ రాకతో ఆ సంతోషం రెట్టింపు కానుంది. వృత్తిపరమైన బాధ్యతలు - వ్యక్తిగత జీవితాన్ని ఎంతో హుందాగా నిర్వహిస్తున్న దీపికా, రణ్వీర్ సింగ్ ల పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.