సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం `మాతృభూమి` విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో అత్యంత కీలకమని భావించిన కొన్ని సన్నివేశాలపై సెన్సార్ బోర్డు కోత విధించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రస్తావనలు -ఆ పోరాట దృశ్యాలను సినిమా నుండి పూర్తిగా తొలగించారు. ఈ సన్నివేశాలు సినిమాకు గుండెకాయ వంటివని చిత్ర యూనిట్ భావించినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని తొలగించాల్సి వచ్చింది.
ఈ నిర్ణయం వెనుక బలమైన దౌత్యపరమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ - చైనా మధ్య ఉన్న సున్నితమైన సరిహద్దు సంబంధాలు, కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో సినిమాల ద్వారా ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకూ డదని ప్రభుత్వం భావిస్తోంది. సినిమాలోని సన్నివేశాలు వాస్తవ సంఘటనలను ప్రతిబింబిస్తూ ఉన్నప్పటికీ అవి అంతర్జాతీయ స్థాయిలో వివాదాలకు దారితీసే అవకాశం ఉందనే ఉద్దేశంతో సెన్సార్ బోర్డు ఈ కోత విధించినట్లు సమాచారం. దేశ ప్రయోజనాలు - దౌత్య నీతి దృష్ట్యా ఈ మార్పులు అనివార్యమయ్యాయి.
అయితే సినిమాలోని ప్రధానమైన యాక్షన్ బ్లాక్స్ , ఎమోషనల్ సీన్స్ తొలగించడంపై సల్మాన్ అభిమానులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిత్ర బృందం కూడా ఈ మార్పుల వల్ల కథా గమనం దెబ్బతినకుండా ఉండేందుకు రీ-ఎడిటింగ్ పనుల్లో నిమగ్నమైంది. గల్వాన్ ప్రస్తావనలు లేకపోయినా, భారత సైనికుల ధైర్యసాహసాలను చాటిచెప్పే ఇతర అంశాలతో సినిమాను పవర్ఫుల్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. `మాతృభూమి` చిత్రం ఈ మార్పుల తర్వాత ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.