భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న రెండు భారీ ప్రాజెక్టులు నితేష్ తివారీ `రామాయణ్` రాజమౌళి `వారణాసి`. అయితే రాజమౌళి చిత్రం కంటే ముందే `రామాయణ్` పార్ట్-1 విడుదల కానుండటం ఆ చిత్రానికి వ్యాపార పరంగా ప్రేక్షకుల ఆదరణ పరంగా అడ్వాంటేజ్గా మారనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి ఒకసారి విజువల్ స్టాండర్డ్స్ సెట్ చేశాక ఆ తర్వాత వచ్చే సినిమాలను ప్రేక్షకులు అదే స్థాయిలో పోల్చి చూస్తారు. కానీ నితేష్ తివారీ సినిమా ముందే రావడం వల్ల ఎటువంటి భారీ పోలికల ఒత్తిడి లేకుండా తనదైన శైలిలో ప్రేక్షకులను మాయ చేసే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఈ చిత్రానికి లభించనుంది.
ముందస్తు విడుదల వల్ల `రామాయణ్` చిత్రానికి థియేటర్ల కేటాయింపులో కూడా ఎంతో కలిసిరానుంది. రాజమౌళి సినిమా విడుదలవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా స్క్రీన్లన్నీ ఆ సినిమాకే కేటాయించాల్సి ఉంటుంది. దీనివల్ల ఇతర సినిమాలకు థియేటర్ల కొరత ఏర్పడుతుంది. కానీ నితేష్ తివారీ సినిమా ముందుగానే రావడం వల్ల ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో కూడా పెద్ద సంఖ్యలో స్క్రీన్లను దక్కించుకుని భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది.
ఇది కేవలం వసూళ్లకే కాకుండా డిజిటల్ , శాటిలైట్ హక్కులను భారీ ధరలకు విక్రయించుకోవడానికి, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ లో ఎటువంటి పోటీ లేకుండా ప్రమోట్ చేసుకోవడానికి ట్రేడ్ పరంగా సేఫ్ జోన్ను కల్పిస్తుంది.
సాంకేతికంగా రాజమౌళిని ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పిలుస్తారు. ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ సినిమా వచ్చినా అది సాంకేతికంగా రాజమౌళి మార్కును అందుకోవాలనే కఠినమైన సవాలును ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నితేష్ తివారీ సినిమా ముందే రావడం వల్ల అటువంటి పోలికల నుండి తప్పించుకున్నట్లే. తనదైన శైలిలో రామాయణాన్ని ఆవిష్కరించే స్వేచ్ఛ దర్శకుడికి ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పౌరాణిక, ఆధ్యాత్మిక చిత్రాలకు ఆదరణ పెరిగిన నేపథ్యంలో భక్తితో కూడిన రామాయణం ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు భారీగా రప్పించగలదు. తద్వారా రామాయణ్ బాక్సాఫీస్ వద్ద సెట్ చేసే రికార్డులే తదుపరి రిలీజ్ అయ్యే `వారణాసి` చిత్రానికి అసలైన టార్గెట్గా మారనున్నాయి.