టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ కోసం తీసుకుంటున్న సుదీర్ఘ విరామం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా వేగంగా సినిమాలు పూర్తి చేసే అలవాటున్న రావిపూడి, కొన్ని నెలల పాటు బాహ్య ప్రపంచానికి దూరమై స్క్రిప్ట్ పనిలో నిమగ్నమవ్వడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ కోసం ఆయన ఒక భారీ యానిమేషన్ స్క్రిప్ట్ను సిద్ధం చేస్తున్నారనే వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తున్నాయి. కేవలం కథా చర్చల కోసమే ఆయన ఇంత సమయం వెచ్చిస్తుండటం చూస్తుంటే తదుపరి చిత్రం ఒక విజువల్ వండర్గా ఉండే అవకాశం ఉంది.
రావిపూడి మార్క్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ .. పొట్టచెక్కలయ్యే కామెడీ. అయితే, యానిమేషన్ జానర్ను ఎంచుకోవడం ద్వారా ఆయన తన పంథాను పూర్తిగా మార్చుకోబోతున్నట్లు అర్థమవుతోంది. సాధారణ సినిమాల్లో కంటే యానిమేషన్ చిత్రాల్లో కామెడీని పండించడానికి, ఊహాతీతమైన సన్నివేశాలను సృష్టించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇటీవల కాలంలో వచ్చిన `మహావతార్ - నరసింహ` వంటి చిత్రాలు యానిమేషన్ విభాగంలో కొత్త ఒరవడిని సృష్టించాయి. అదే బాటలో అనిల్ రావిపూడి కూడా ఒక ట్రెండీ - వినోదాత్మక యానిమేషన్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
`ఎఫ్ 2` ఫ్రాంఛైజీతో ఫ్యామిలీ ఆడియన్స్ను, `భగవంత్ కేసరి` , `మన శంకరవరప్రసాద్ గారు` చిత్రాలతో మాస్ ప్రేక్షకులను అలరించిన రావిపూడి ఇప్పుడు యానిమేషన్ రంగంలోకి అడుగుపెట్టడం ఆయనలోని టెక్నికల్ పరిణతికి నిదర్శనం. ఒక కమర్షియల్ దర్శకుడు ఇలాంటి విభిన్నమైన జానర్ను ఎంచుకోవడం టాలీవుడ్లో ఆసక్తికరమైన పరిణామం.
సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఆయన కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని అధికారిక వివరాలు తెలియాల్సి ఉన్నా.. రావిపూడి కలం నుంచి, సృజన నుంచి సిద్ధమవుతున్న ఈ `యానిమేషన్ మాయాజాలం` ఏ స్థాయిలో ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.