నటి సోనాలి బింద్రే ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు. పూణె జిల్లాలోని లోనావాలా సమీపంలో ఉన్న తన భూమిని సోనాలి ఆక్రమించారంటూ ఒక స్థానిక రైతు పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. తన పొలం పక్కనే ఉన్న సోనాలి బింద్రే ఆస్తిలోకి తన భూమిని కలిపేసి అక్రమంగా కంచె వేయడమే కాక ప్రశ్నించినందుకు తనను బెదిరించారని ఆ రైతు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆయన స్థానిక పోలీసులతో పాటు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేయడంతో విషయం మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ఈ ఆరోపణలను సోనాలి బింద్రే బృందం , ఆమె తరపు న్యాయవాదులు ఖండించారు. రైతు చేస్తున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదని ఆ భూమిని తాము అన్ని నిబంధనలకు అనుగుణంగా చట్టబద్ధంగా కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని పత్రాలు సకమ్రంగా ఉన్నాయని, కేవలం సెలబ్రిటీ కావడంతో డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతోనే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని సోనాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరంగానే ఈ విషయాన్ని ఎదుర్కొంటామని ఆమె ప్రతినిధులు తెలిపారు.
ప్రస్తుతం ఈ ఫిర్యాదుపై పూణె గ్రామీణ పోలీసులు ప్రాథమిక విచారణను ప్రారంభించారు. వాస్తవాలను వెలికితీసేందుకు రెవెన్యూ రికార్డులను నిశితంగా పరిశీలించడంతో పాటు, వివాదాస్పద స్థలంలో భూసర్వే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ సర్వే పూర్తయితేనే భూమి ఆక్రమణకు గురైందా లేదా అనే విషయంపై ఒక స్పష్టత వస్తుందని అప్పటి వరకు ఎటువంటి ముగింపుకు రాలేమని పోలీసులు వెల్లడించారు.