ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు-2026 బిల్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు బిల్లుకు మద్దతు పలకగా, వైసీపీ ఎంపీలు మాత్రం ఈ చర్చ మధ్యలో సభ నుంచి వాకౌట్ చేశారు. సుమారు రెడున్నర గంటల చర్చ అనంతరం, ఈ బిల్లు ఆమోదం పొందినట్లు ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు.
దీనిపట్ల టీడీపీ, బిజెపి హర్షం వ్యక్తం చెయ్యగా.. ఏపీ మినిస్టర్ నారా లోకేష్ టివిలో లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన వెంటనే క్లాప్స్ కొడుతూ ఆనందం వ్యక్తం చేసారు. ఈ చారిత్రక సందర్భంపై లోకేశ్ స్పందిస్తూ.. ఇది ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే రోజని అభివర్ణించారు. సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్..
అమరావతి చట్టబద్దత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చ మొత్తం టీవీలో చూశాను. ఉత్కంఠ రేపింది. అమరావతి చరిత్ర-సంస్కృతి, ఆవశ్యకత సభ్యులు వివరిస్తుంటే ఒక ఆంధ్రుడిగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం, దేశంలోని వివిధ పార్టీలు మద్దతుగా నిలవడం ఐదుకోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టింది. లోక్ సభ వేదికగా అమరావతి గొప్పతనం దేశమంతటికీ మరోసారి పరిచయమైంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటులో చరిత్ర సృష్టించిన అమరావతి చట్టబద్ధత బిల్లు చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడం వారి ద్రోహబుద్ధికి నిదర్శనం. జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిలో ఒక్క ఇటుకనూ తాకలేడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధినీ ఆపలేడు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామరం.. అంటూ ట్వీట్ చేసారు.