కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావుకు సంబంధించిన విస్తుపోయే నిజాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో వెలుగులోకి వచ్చాయి. అక్రమ మార్గంలో కోట్లు సంపాదించాలనే ఆశతో ఆఫ్రికా గనుల నుంచి తక్కువ ధరకు బంగారం కొనాలని ప్లాన్ చేసిన ఆమె బెన్ అనే ఉగాండా ఏజెంట్ చేతిలో ఏకంగా 2 కోట్లు పోగొట్టుకుని మోసపోయింది. ఈ భారీ నష్టం తర్వాత తన పంథా మార్చుకున్న రన్యారావు దుబాయ్ నుంచి భారత్కు నేరుగా స్మగ్లింగ్ చేయడం ప్రారంభించిందని అధికారులు గుర్తించారు.
ఈ అక్రమ రవాణాలో రన్యా తన సవతి తండ్రి (ఏడీజీపీ స్థాయి పోలీస్ అధికారి) హోదాను అడ్డం పెట్టుకుని ఎయిర్పోర్టులో లభించే ప్రొటోకాల్ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసింది. పోలీసు అధికారి కూతురిగా లభించే మర్యాదలతో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి సులభంగా తప్పించుకునేది. 2024 మార్చి నుంచి 2025 మార్చి మధ్య కేవలం ఏడాది కాలంలోనే ఆమె 15 సార్లు దుబాయ్ పర్యటించి సుమారు 127 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు ఈడీ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. దీని విలువ దాదాపు 102 కోట్లు ఉంటుందని అంచనా.
ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న రన్యా రావుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) 102.55 కోట్ల భారీ జరిమానా విధించింది. సినీ గ్లామర్ను, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన ఈ స్మగ్లింగ్ దందా ఇప్పుడు కన్నడ నాట సంచలనంగా మారింది. ఈ కేసులో ఆమె తండ్రి పాత్రపై కూడా ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరుపుతుండటంతో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.