బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో సినీ పరిశ్రమలో దుమారం రేపారు. భారతీయ చిత్ర పరిశ్రమలో సూపర్స్టార్లు దర్శకులను వేధిస్తారని, వారిని బెదిరింపులకు గురిచేస్తారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. హాలీవుడ్లో స్పీల్బర్గ్, నోలన్ వంటి దర్శకులకు నటుల కంటే ఎక్కువ గౌరవం ఉంటుందని, కానీ మన దేశంలో మాత్రం ఫిల్మ్మేకర్లకు తగిన గుర్తింపు, సరైన పారితోషికం లభించడం లేదని ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ఘనవిజయం సాధించిన `ధురంధర్ 2` చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్పై కంగనా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా సక్సెస్తో ఆదిత్య ధర్ ఒక సూపర్స్టార్ డైరెక్టర్ గా అవతరించారని ఆమె కొనియాడారు. దర్శకులు ఎంతో శ్రమించినా క్రెడిట్ అంతా హీరోలకే వెళ్లే మన సంస్కృతిలో ఏ హీరో కంటే ప్రకాశవంతంగా వెలిగిపోతున్న ఆదిత్య ధర్ వంటి మేకర్లను చూసి యువత స్ఫూర్తి పొందాలని కోరారు. ఆదిత్య ధర్ విజయం సినీ పరిశ్రమను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే ఈ సుదీర్ఘ పోస్టులో కంగనా కేవలం దర్శకుడిని మాత్రమే ప్రశంసించారు. చిత్ర హీరో రణవీర్ సింగ్ను గానీ, ఇతర నటీనటులను గానీ కనీసం ట్యాగ్ చేయకపోవడం గమనార్హం. కేవలం నటులు కావాలనే కలలు కనే నేటి తరంయువత, ఆదిత్య ధర్ను చూసి గొప్ప ఫిల్మ్మేకర్లు కావాలని ఆకాంక్షించాలని ఆమె పిలుపునిచ్చారు. పరి శ్రమలోని పురుషాధిక్యతను, హీరోల అహంకారాన్ని ప్రశ్నిస్తూ కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్గా మారాయి.