ఏపీ ఐటి, విద్యా శాఖామంత్రి నారా లోకేష్ ఈరోజు మంగళవారం ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. మధ్యాన్నం భోజనం బాలేదు అంటూ ఈమధ్యన మీడియాలో హల్ చల్ చేసిన ఎన్టీఆర్ జిల్లా, మైలవరం దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
వారం రోజుల క్రితం భోజనం బాగాలేదంటూ ఆ స్కూల్ హెడ్మాస్టర్ జాన్ పథకం ప్రకారం పిల్లలతో వీడియో తీయించి మీడియాకు వదిలారు. దీనిపై మినిస్టర్ నారా లోకేష్ వెంటనే స్పందించిన మంత్రి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, పిల్లలకు పెట్టే భోజనం రుచి, శుచి, పోషకవిలువలు తగ్గితే సహించేది లేదని హెచ్చరించారు.
అయితే ఈరోజు ఉదయం నారా లోకేష్ మంగళగిరి సమీపం చినకాకానిలోని మయూరి టెక్ పార్క్ భవనం ఐదో అంతస్తులో ఏర్పాటుచేసిన APEDB నూతన కార్యాలయాన్ని నారా లోకేష్ ప్రారంభించారు. అక్కడి నుంచి మంత్రి నారా లోకేష్ షెడ్యూల్ ప్రకారం వెళ్లాల్సిన వైపు నుంచి కాన్వాయ్ మరో వైపునకు మళ్లించగా ఆయన కాన్వాయ్ ని అధికారులు, సెక్యూరిటీ వారి వాహనాలు అనుసరించాయి.
అక్కడినుంచి మంత్రి లోకేష్ మధ్యాహ్నం భోజనం బాగాలేదని పిల్లలు చెప్పిన మైలవరం తారకరామానగర్ మండలపరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు మంత్రి చేరుకుని.. పిల్లలతో నేరుగా మాట్లాడారు. అక్కడి సమస్యలు తెలుసుకున్నారు.
ఇంట్లో మన పిల్లలకు పెట్టే భోజనానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, అంతకంటే నాణ్యమైన భోజనం విద్యార్థులకు పెట్టాలని, ఏ మాత్రం క్వాలిటీ తగ్గినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.అంతేకాకుండా అక్కడ భోజనం బాగాలేకపోతే ఎలా ఫిర్యాదు చేయాలో పిల్లలకు చెప్పారు. విద్యార్థులకు పెట్టే భోజనం మంత్రి రుచి చూశారు. మంత్రి లోకేష్ హఠాత్తుగా పాఠశాలలో ప్రత్యక్షం కావడంతో మండలం నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకూ షాక్ అయ్యారు.