లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ వివాహం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. క్రీడా రంగం నుండి మాత్రమే కాకుండా చిత్ర పరిశ్రమ నుంచి కూడా దిగ్గజాలు ఈ వివాహ వేడుకకు హాజరవుతుండటం విశేషం. ముఖ్యంగా దక్షిణాది సినీ ప్రముఖులతో అందునా టాలీవుడ్తో సచిన్కు ఉన్న సత్సంబంధాల కారణంగా అర్జున్ పెళ్లికి హాజరయ్యే టాలీవుడ్ ప్రముఖులు, ఇతర దక్షిణాది స్టార్ల జాబితా గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా సచిన్ తో రిలేషన్ ఉన్న ప్రతి టాలీవుడ్ స్టార్ గురించి, దక్షిణాది తారల గురించి ఆరా తీస్తే తెలిసిన సంగతులివి...
టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి ఈ వివాహానికి హాజరయ్యేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నారు. సచిన్, చిరంజీవిల మధ్య కేవలం గౌరవమే కాకుండా బలమైన వ్యాపార బంధం కూడా ఉంది. గతంలో ఐఎస్ఎల్ (ISL)లో ఆడే కేరళ బ్లాస్టర్స్ ఫుట్బాల్ టీమ్ను చిరంజీవి- అల్లు అరవింద్- నిమ్మగడ్డ ప్రసాద్ బృందంతో కలిసి సచిన్ కొనుగోలు చేశారు. ఈ సుదీర్ఘ స్నేహంతో చిరంజీవి తన కుటుంబంతో కలిసి ముంబై వేడుకలో సందడి చేసే అవకాశం ఉంది. అక్కినేని నాగార్జునకు కూడా సచిన్తో దశాబ్దాల కాలంగా మంచి స్నేహం ఉంది. అమితాబ్ బచ్చన్, సచిన్, నాగార్జున వంటి దిగ్గజాలు పలు సందర్భాల్లో కలిసి ఉన్న ఫోటోలు ఇప్పటికే ఇంటర్నెట్లో వైరల్గా ఉన్నాయి. వ్యాపారపరంగా కూడా సచిన్తో మంచి సంబంధాలు ఉన్న నాగార్జున దంపతులకు ఇప్పటికే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ వేడుకకు హాజరయ్యేందుకు అవకాశం ఉంది. నమ్రత శిరోద్కర్ ముంబై మూలాలు ఉన్న వ్యక్తి కావడం.. సచిన్ అంటే మహేష్కు ఉన్న ప్రత్యేక గౌరవం ఈ జంట హాజరు కావడానికి ప్రధాన కారణం కానుంది.
యువ తరం నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సచిన్ టెండూల్కర్ను తన రోల్ మోడల్గా భావించే చరణ్కు విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లతో కూడా మంచి స్నేహం ఉంది. ఈ క్రికెట్-సినిమా అనుబంధం వల్ల అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. కేరళ బ్లాస్టర్స్ టీమ్ భాగస్వామిగా సచిన్తో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందిందని గుసగుస వినిపిస్తోంది. కోలీవుడ్ సహా ఇతర దక్షిణాది పరిశ్రమల నుంచి కూడా భారీగా తారలు తరలి వెళ్లే ఛాన్సుంది. సచిన్ స్వయంగా అభిమానించే సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వివాహానికి హాజరు కావడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవం అపారమైనది. అలాగే భారతీయ సినిమా దిగ్గజం కమల్ హాసన్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ అతిథుల జాబితాలో ఉన్నారు. మోహన్ లాల్కు కేరళ ఫుట్బాల్ ద్వారా సచిన్తో ఉన్న పరిచయం కారణంగా శుభలేఖ అందిందని గుసగుస వినిపిస్తోంది.
ముంబై వేదికగా జరగనున్న అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకలు దక్షిణాది స్టార్ల రాకతో మరింత మెరుపును సంతరించుకుంటాయనడంలో సందేహం లేదు. క్రికెట్ - సినిమా రంగాల మేళవింపుగా సాగే ఈ వేడుక భారతీయ సెలబ్రిటీ ప్రపంచంలో ఒక చిరస్మరణీయ వేడుకగా మిగిలిపోనుంది. కేవలం శుభాకాంక్షలు అందించడమే కాకుండా.. దశాబ్దాల నాటి స్నేహబంధాలను మరోసారి గుర్తుచేసుకోవడానికి ఈ పెళ్లి వేదిక కానుంది. ఈ ఆదివారం (మార్చి 15న) అర్జున్- చందోక్ వివాహం ముంబైలో అత్యంత వైభవంగా జరగనుంది.