ప్రస్తుతం టాలీవుడ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనుసరిస్తున్న వ్యూహాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కేవలం వెండితెరపైనే కాకుండా, క్షేత్రస్థాయిలో తన ఫ్యాన్ బేస్ను ఒక క్రమశిక్షణ కలిగిన సైన్యంలా తీర్చిదిద్దడంలో ఆయన ఒక `పాథ్ బ్రేకింగ్ స్ట్రాటజీ`ని అమలు చేస్తున్నారు. దేశ విదేశాల్లో ఉన్న తన అభిమానులను ఒకే తాటిపైకి తెచ్చి, వారి ద్వారా సమాజానికి మేలు చేసేలా కమిటీలను బలోపేతం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం సినిమా ప్రమోషన్ల కోసం చేస్తున్న ప్రయత్నం కాదని, దీని వెనుక ఒక బలమైన దీర్ఘకాలిక ప్రణాళిక ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం.
ఇటీవల రాష్ట్ర , జిల్లా స్థాయి అసోసియేషన్లను బలోపేతం చేస్తున్న తీరును గమనిస్తే.. అల్లు అర్జున్ మునుముందు కేవలం సినిమా రంగానికే పరిమితం కాకుండా, ఇతర కీలక రంగాల్లోనూ తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారనే సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యంగా తన అభిమాన గణాన్ని పూర్తిగా సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం ఇందులో ప్రధాన భాగం. తమిళ నటుడు దళపతి విజయ్ తన అభిమాన సంఘాలను ఎలాగైతే సామాజిక శక్తులుగా మార్చారో.. అదే తరహా మ్యాసివ్ థ్రెడ్ను బన్నీ కూడా డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రజలకు అవసరమైన సమయాల్లో అండగా నిలిచేలా అభిమానులను సమాయత్తం చేయడం విశేషం.
ఈ మాస్టర్ ప్లాన్లో భాగంగా తొలుత తెలంగాణలోని ఐదు ప్రధాన జిల్లాలపై దృష్టి సారించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో ఇటీవల కరీంనగర్లో నిర్వహించిన భారీ సమావేశం అత్యంత విజయవంతమైంది. ఈ వేదిక ద్వారా తెలంగాణలో సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఒకే గొడుగు కిందికి తెచ్చి, వారికి స్పష్టమైన దిశానిర్దేశం చేయడంలో ఈ సమావేశం కీలక పాత్ర పోషించింది.
ముఖ్యంగా AAFA తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ నాయకత్వంలో కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు నూతన కమిటీలను ప్రకటించారు. ``ప్రతి సంవత్సరం వినూత్నమైన సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజానికి అండగా ఉండాలి`` అనే అల్లు అర్జున్ సందేశాన్ని ఫ్యాన్స్ అత్యంత సీరియస్గా తీసుకున్నారు. ఈ కమిటీల ఏర్పాటు కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో `అల్లు ఆర్మీ` చేసే సామాజిక పనులు ఐకాన్ స్టార్ ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.