గల్ఫ్ దేశాలపై ఇరాన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీంగా చమురు దిగుమతి సమస్యాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. రష్యా దేశం నుంచి భారత్ చమురు కొనుగోలు చేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముప్పై రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు ఇవ్వడంపై `మక్కల్ నీది మయ్యం` అధినేత కమల్ హాసన్ అత్యంత ఘాటుగా స్పందించారు.
భారత్ ఒక స్వతంత్ర సార్వభౌమ దేశమని.. విదేశీ ప్రభుత్వాల ఆదేశాలకు లోబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ.. ట్రంప్ను ఉద్దేశించి మాస్ వార్నింగ్ ఇచ్చారు. `మీ పని మీరు చూసుకోండి` అని ఎక్స్ వేదికగా హెచ్చరించారు. పశ్చిమాసియాలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి తర్వాత నెలకొన్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాకు ఏర్పడిన ఆటంకాల దృష్ట్యా అమెరికా ఈ తాత్కాలిక వెసులుబాటు కల్పించింది. అయితే ఒక అగ్రరాజ్యం ఇచ్చే మినహాయింపులపై భారత్ ఆధారపడటం లేదని.. దూరతీరాల నుండి వచ్చే ఆదేశాలను పాటించే కాలం చెల్లిపోయిందని కమల్ హాసన్ తన బహిరంగ లేఖలో సీరియస్ గా కౌంటర్ ఇచ్చారు.
భారత ప్రభుత్వం సైతం అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో దేశ ఇంధన భద్రత విషయంలో పూర్తి ధీమాగా ఉంది. ముడి చమురు దిగుమతి వనరులను 27 దేశాల నుండి 40 దేశాలకు విస్తరించడం ద్వారా భారత్ తన సరఫరా మార్గాలను సురక్షితం చేసుకుంది. దేశ ప్రయోజనాలే కీలకంగా ఎక్కడ పోటీ ధరలు లభిస్తే అక్కడి నుండే చమురును కొనుగోలు చేస్తామని మీడియా ద్వారా స్పష్టం చేసారు.
ఇరాన్ ప్రతీకార దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో చమురు ఉత్పత్తి కేంద్రాలు మూతపడినా.. భారత్ తన వ్యూహాత్మక చర్యల ద్వారా ఇంధన స్థిరత్వాన్ని కాపాడుకుంటోంది. ఈ నేపథ్యంలో ఒక రాజకీయ నాయకుడిగా కమల్ హాసన్ నేరుగా ట్రంప్ను ప్రశ్నించడం అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.