ప్రముఖ యూట్యూబర్ అనురాగ్ దోభాల్ (UK07 రైడర్) పబ్లిక్ రోడ్డుపై చేసిన విన్యాసం ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఉండగానే తన కారును ఉద్దేశపూర్వకంగా క్రాష్ చేయడం చూసి అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అతడు గంటకు 150 కి.మీల స్పీడ్ తో కార్ ని నడిపి క్రాష్ చేసాడు. ఆ సమయంలో ఆ కార్ కి అటూ ఇటూ ఇతర వాహనాలు వెళుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఆయన రోడ్డుపై గాయాలతో పడి ఉండటం, స్థానికులు వచ్చి సహాయం చేయడం కనిపిస్తోంది. ఇది ప్రమాదమా లేక కావాలని చేసుకున్న ఆత్మహత్యాయత్నమా అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి. అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాపాయం నుండి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటన వెనుక బలమైన వ్యక్తిగత కారణాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా కులాంతర వివాహం విషయంలో తలెత్తిన గొడవలు రచ్చకెక్కడం.. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తీవ్రం కావడంతో అనురాగ్ తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ ఆవేశంలోనే ఆయన రోడ్డుపైకి వచ్చి ఇలాంటి అనాలోచిత నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా వినిపిస్తోంది. అయితే వ్యక్తిగత సమస్యలను సాకుగా చూపి పబ్లిక్ ప్రాపర్టీని.. ఇతర వాహనదారుల ప్రాణాలను రిస్కులో పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసే వ్యక్తి ఇలాంటి బాధ్యతారాహిత్యమైన చర్యకు పాల్పడటం అత్యంత దారుణమని విమర్శిస్తున్నారు. పైగా ఇలాంటివి లైవ్ స్ట్రీమింగ్ చేయడం ద్వారా ఇతరులను ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాడా? అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.