ఒకే రోజు లేదా ఒక్క రోజు గ్యాప్ లో ఒకే హీరో నటించిన సినిమాలు రిలీజ్ అవ్వడం అన్నది చాలా అరుదు. పాత రోజుల్లో కూడా ఇలాంటి సన్నివేశం పెద్దగా కనిపించదు. పోటా పోటీగా రిలీజ్ చేసే అవకాశాలు అప్పట్లో కనిపించేవి. కానీ కాలక్రమంలో పోటీకి బధులుగా సినిమాల్ని తెలివిగా రిలీజ్ చేయడం ప్రారంభమైంది.
ఈగోలు పక్కనబెట్టి ఎలా రిలీజ్ చేస్తే ప్రేక్షకుల నుంచి డబ్బులొస్తాయనే స్ట్రాటజీతోనే నిర్మాత-హీరోలు పక్కాగా ప్లాన్ చేసుకుని మరీ రిలీజ్ చేస్తున్నారు. అయితే తాజాగా యంగ్ హీరో శ్రీవిష్ణు మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేస్తున్నాడు. అతడు హీరోగా నటించిన రెండు చిత్రాలు ఒక్క రోజు గ్యాప్ లోనే రిలీజ్ అవుతున్నాయి.
శ్రీవిష్ణు హీరోగా నటించిన `మృత్యుంజయ్` ఫిబ్రవరి 27న రిలీజ్ అవుతుంది. ఆ చిత్రం రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే అదే హీరో నటించిన ఫిబ్రవరి 28న `విష్ణు విన్యాసం` కూడా రిలీజ్ అవుతుంది. ఇలా రోజు గ్యాప్ లో రెండు సినిమా రిలీజ్ లు అన్నది శ్రీవిష్ణు కెరీర్ లోనే కాదు..ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత చోటు చేసుకుంటోన్న సన్నివేశం.
గతంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన `ఎవడే సుబ్రమణ్యం`, `జెండాపై కపిరాజు` 2015 మార్చి 21న ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. దీంతో అప్పట్లో ఓ రికార్డుగా మాట్లాడుకునే వారు. కానీ ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇంకా ముందుకెళ్తే నటసింహ బాలకృష్ణ నటించిన `నిప్పురవ్వ`, `బంగారు బుల్లోడు` 1993 సెప్టెంబర్ 3న ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. తాజాగా శ్రీవిష్ణు సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ అవ్వడం ఆసక్తికరం.